టీఆర్ఎస్లోనే ఉంటాం lపార్టీ గుర్తుపైనే గెలిచాం
అధిష్టానం ఆదేశాల మేరకే పనిచేస్తాం
స్పష్టం చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
మంత్రి గంగులను కలిసిన జమ్మికుంట ఎంపీటీసీలు, సర్పంచ్లు
వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం : మంత్రి గంగుల
పార్టీకి ఎదురులేదు : రాజ్యసభ సభ్యడు కెప్టెన్
కార్పొరేషన్, మే 14: తామంతా టీఆర్ఎస్లోనే ఉంటామని, ఆ పార్టీ గుర్తుపైనే గెలిచామని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు జమ్మికుంట మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జమ్మికుంటకు సంబంధించిన వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, తాము సీఎం కేసీఆర్తోనే ఉంటామని, ఆయనతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలోనూ అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరుగుతున్నదన్నారు.
పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదు: మంత్రి గంగుల
పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని, ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ ఎంతో గౌరవించి అనేక పదవులు ఇచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పార్టీ లేకుంటే అసలు ఈటల రాజేందర్ ఎక్కడ ఉండే వారని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు పథకాలను ఉద్దేశించి పరిగెలు అంటూ అవహేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. 20 ఏండ్లు అనేక పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి పార్టీని విమర్శించడం సరికాదన్నారు. పార్టీని చీల్చే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పార్టీకి నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ ఉందన్నారు. సీఎం కేసీఆర్ బొమ్మపైనే అందరం గెలిచామని, ఇప్పుడు పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం పద్ధతి కాదని హితవుపలికారు. తెలంగాణ వ్యతిరేకులైన బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో అప్పట్లో చేసుకున్న చీకటి ఒప్పందాలు ఇప్పుడు బహిర్గంతం అవుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్యాదవ్, పొనగంటి మల్లయ్య, జమ్మికుంట సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటరెడ్డి, సర్పంచులు మహేందర్, మారేపల్లి భిక్షపతి, చిదురాల రామస్వామి, రాజు, నేరెళ్ల రాజమౌళి, బొయిన సమ్మయ్య పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోనే ఉంటాం
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల
టీఆర్ఎస్లోనే ఉంటాం.. సీఎం కేసీఆరే మా నాయకుడు.. పార్టీ కన్నతల్లితో సమానం.. ఎలాంటి ద్రోహం చేసేదిలేదు’ అని హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల స్పష్టం చేశారు. శుక్రవారం హుజూరాబాద్లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉన్నా, టీఆర్ఎస్ గుర్తుతోనే గెలిచామని, పార్టీలోనే కొనసాగుతామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చినా పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. పాలకవర్గంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు మొత్తం 23 మంది ఉండగా విలేకరుల సమావేశంలో 16 మంది పాల్గొన్నారని, మిగతావారు అనివార్య కారణాలతో హాజరుకాలేక పోయారని, వారు కూడా టీఆర్ఎస్లోనే ఉంటారని చెప్పినట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బర్మావత్ రమ, తాళ్లపల్లి శ్రీనివాస్, కల్లెపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, తోట రాజేంద్రప్రసాద్, తొగరు సదానందం, ముక్కపల్లి కుమార్, మెరుగు కొండల్రెడ్డి, మంద ఉమాదేవి, ఉజ్మా నూరిన్, శివకుమార్, బర్మావత్ యాదగిరి, మారెపల్లి సుశీల, మొలుగు సృజన, పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వెంటే నడుస్తాం
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు
సీఎం కేసీఆర్ మాత్రమే తమ నాయకుడని, ఆయన వెంటే నడుస్తామని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు స్పష్టం చేశారు. తాము టీఆర్ఎస్తోనే ఉంటామని, పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో కనీవిని ఎరుగని తరహాలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తనతోపాటు కౌన్సిలర్లు పార్టీని వీడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయనకు అండదండగా ఉంటామని స్పష్టం చేశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభివృద్ధి కోసం నిధులు అందిస్తున్నారని పేర్కొన్నారు.