ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ ( Clash ) చోటుచేసుకున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇవాళ సంగ్లీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు స్థానిక వ్యాపారులు, బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డుతగిలారు. సీఎం కారు దగ్గరికి గుంపులుగా వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.
అయితే, గుంపులు గుంపులుగా జనం సీఎం కారుపైకి దూసుకురావడంతో పోలీసులు వారిని తోసేశారు. పోలీసులు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది కలిసి సీఎం కాన్వాయ్ని అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత పోలీసులు, స్థానిక బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.