న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) బిల్లు పెద్దలసభలో ఆమోదం పొందడంపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ద్వారా పెత్తనం చెలాయించాలని బీజేపీ యోచిస్తోందని మోదీ సర్కార్పై గురువారం ఆయన విరుచుకుపడ్డారు. ఢిల్లీపై ఎల్జీకి సర్వాధికారాలు కట్టబెట్టే ఈ వివాదాస్పద బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదని విమర్శించారు.
ఎల్జీ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపాలని బీజేపీ కోరుకుంటోందని ఇక అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశ్నించారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తాము కోరినా ప్రభుత్వం అంగీకరించనందున తాము సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. మరోవైపు ఎన్సీటీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.