ఇష్టంతో చదివా: శ్రీజ
నేను కలెక్టర్ కావాలని మా నాన్న ప్రోత్సహించారు. మెడికల్ సైన్స్ ఆప్షనల్గా సివిల్స్కు సన్నద్ధమయ్యాను. ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చూస్తూ ప్రిపేరయ్యా. ఇష్టపడితే కష్టంకాదనుకొని చదివాను. సివిల్స్ సిలబస్ చదువుతున్నకొద్దీ ఆసక్తిగా అనిపించింది. బాలలత మేడం కోచింగ్, మహేశ్భగవత్ సార్ గ్రూపు సైతం నా విజయానికి దోహదపడింది.
న్యూఢిల్లీ/ఖైరతాబాద్, చిక్కడపల్లి, ముషీరాబాద్, హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2020 పరీక్ష తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకం కోసం యూపీఎస్సీ 761 మందిని ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు. 216 మంది మహిళా అభ్యర్థులు. బీహార్లోని కటిహార్ గ్రామానికి చెందిన శుభమ్ కుమార్ మొదటి ర్యాంకు, మధ్యప్రదేశ్కు చెందిన జాగ్రతి అవస్థీ రెండో ర్యాంకు సాధించారు. శుభమ్ కుమార్ ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. జాగృతి మధ్యప్రదేశ్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మానిత్)లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసింది. ఇక వరంగల్కు చెందిన శ్రీజ ఆలిండియా స్థాయిలో 20వ ర్యాంకుతో తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో టాపర్గా నిలిచింది. ఆమె తన తొలి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం విశేషం. హైదరాబాద్లోని ప్రగతి నగర్కు చెందిన మౌనిక 75వ ర్యాంకు సాధించింది. మౌనికకు ఇది రెండో అటెంప్ట్. ఆమె తొలి ప్రయత్నంలోనే సివిల్స్కు ఎంపికైంది. ఉద్యోగం చేస్తూ మళ్లీ పరీక్ష రాసింది. తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 30 మంది సివిల్స్ క్లియర్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అన్నదమ్ములు రాళ్లపల్లి జగత్ సాయి, వసంత్కుమార్ ఇద్దరూ ఒకేసారి సివిల్స్ ర్యాంకులు సాధించడం విశేషం. ఆలిండియా స్థాయిలో టాప్ 25లో 13 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ను గతేడాది అక్టోబర్ 4న నిర్వహించారు. 4.82 లక్షల మంది పరీక్ష రాశారు. 10,564 మంది మెయిన్స్కు, వీరిలో 2,053 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో నుంచి యూపీఎస్సీ 761 మందిని ఎంపిక చేసింది. ఇందులో 25 మంది దివ్యాంగులు ఉన్నారు. 151 మందిని రిజర్వ్ లిస్టులో పెట్టారు. మొత్తం 836 పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది. మార్కులను 15రోజుల్లో వెబ్సైట్లో పెడతామని యూపీఎస్సీ తెలిపింది.
క్యాటగిరీ ఎంతమంది
జనరల్ 263
ఈడబ్ల్యూఎస్ 86
ఓబీసీ 229
ఎస్సీ 122
ఎస్టీ 61
మొత్తం 761
అభ్యర్థి ర్యాంక్
శ్రీజ 20
రాళ్లపల్లి జగత్సాయి 32
దేవగుడి మౌనిక 75
రవికుమార్ 84
యశ్వంత్కుమార్ రెడ్డి 93
ఏబీ శిల్ప 147
వసంత్ కుమార్ 170
సంజనా సిన్హా 207
కంకణాల రాహుల్ రెడ్డి 218
గౌతమి 317
సౌమిత్రాజు 355
శేషాద్రిణి రెడ్డి 401
ఆడెపు వర్షిత 413
తిరుపతిరావు 441
మధుసూదన్రావు 489
ప్రశాంత్ సూరపాటి 498
అనిల్కుమార్ 584
అభిషేక్ అందాసు 616
కోట కిరణ్కుమార్ 652
పులిచెర్ల రమణయ్య 681
దోనెపూడి విజయ్బాబు 682
ఏదుగుల వేగిణి 686
కల్లం శ్రీకాంత్రెడ్డి 747
హారిక 700
మూడో అటెంప్ట్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన శుభమ్
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సేవ చేయడానికి ఐఏఎస్ కావాలనుకొన్నానని, తన కల నిజం అయిందని శుభమ్ కుమార్ అన్నాడు. శుభమ్ వయసు 24 ఏండ్లు. 2018లో సివిల్స్కు దరఖాస్తు చేశాడు. పరీక్ష రాయలేదు. 2019లో ఎంపికయ్యాడు. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం పుణెలోని నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్(నాడ్ఎఫ్ఎమ్)లో శిక్షణ పొందుతున్నాడు. ఈ ఏడాది ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. శుభమ్ కుమార్ ఆంత్రపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకొన్నాడు.
ఉద్యోగం వదిలి వచ్చిన జాగృతి
జాగృతి వయస్సు 24 ఏండ్లు. 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. 2017లో భెల్లో ఉద్యోగంలో చేరింది. రెండేండ్లు జాబ్ చేసిన తర్వాత సివిల్స్కు ప్రిపేర్ కావడానికి ఉద్యోగం వదిలేసింది. 2019లో మొదటి అటెంప్ట్లో క్లియర్ చేయలేదు. రెండో ప్రయత్నంలో ఏకంగా రెండో ర్యాంకు సాధించింది. మహిళల విభాగంలో చూస్తే ఆలిండియా విభాగంలో జాగృతిదే మొదటి ర్యాంకు. జాగృతి అప్షనల్ సబ్జెక్టు సోషియాలజీ. గ్రామీణ ప్రాంత మహిళల్లో నైపుణ్యం పెంచడంపై తాను దృష్టి పెడతానని జాగృతి చెప్పింది.
టీనా దాబీ సోదరి రియా దాబీకి 15వ ర్యాంకు
2015లో సివిల్స్లో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి, అదే ఏడాది రెండో ర్యాంకు సాధించిన అమీర్ ఖాన్ను పెండ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన టీనా దాబీ గుర్తుందా.. ఆమె సోదరి రియా దాబీ కూడా సివిల్స్లో సత్తా చాటింది. తాజా ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. టీనా దాబీ దంపతులు ఇటీవల విడిపోయారు.
రెండో ప్రయత్నంలో.. యశ్వంత్కుమార్ రెడ్డి (ఏపీ)(ర్యాంక్ 93)
మాది కర్నూల్ టౌన్. చదువంతా కర్నూల్లోనే పూర్తయింది. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడ్డాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగానే సివిల్స్కు ప్రిపేరయ్యా. గతంలో ఒకసారి ప్రయత్నించాను. ప్రిలిమ్స్ దశలోనే వెనుదిరిగా. రెండో ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నించాను. 93వ ర్యాంక్ వచ్చింది. కచ్చితంగా ఐఏఎస్ అధికారినవుతానన్న నమ్మకముంది. పేదల కష్టాలను దూరం చేసేందుకు నావంతుగా కృషిచేస్తా.
ఎంజాయ్ చేస్తూ- శ్రీజ (ర్యాంక్ 20)
మాది వరంగల్. నేను రెండో తరగతిలో ఉన్నప్పుడే మేము హైదరాబాద్కు మారాం. నాన్న పేరు శ్రీనివాస్. అమ్మ పేరు లత. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి 2019లో ఎంబీబీఎస్ పూర్తిచేశా. నేను కలెక్టర్ కావాలని మా నాన్న ప్రోత్సహించారు. మెడికల్ సైన్స్ ఆప్షనల్గా సివిల్స్కు సన్నద్ధమయ్యాను. ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చూస్తూ ప్రిపేరయ్యా. ఇష్టపడితే కష్టంకాదనుకుని సన్నద్ధమయ్యా. సివిల్స్ సిలబస్ సైతం చదువుతున్నకొద్దీ ఆసక్తిగా అనిపించింది. బాలలత మేడం కోచింగ్, మహేశ్ భగవత్ సార్ గ్రూపు సైతం దోహదపడింది. ఇంటర్వ్యూలో మొత్తం మెడికల్కు సంబంధించిన ప్రశ్నలే అడిగారు. ఐఏఎస్గా హెల్త్సెక్టార్లో మార్పులు, సంస్కరణలు తెచ్చేందుకు ప్రయత్నిస్తా.
క్రమశిక్షణతో ఒత్తిడి లేకుండా -సంజనా సిన్హా( ర్యాంక్ 207)
సమాజ సేవ నా జీవిత లక్ష్యం. అమ్మ అరుణశ్రీ మధ్యప్రదేశ్లో బ్యాంక్ బరోడాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. నాన్న ఉదయ్ సిన్హా న్యాయవాది. నాకు చదువుల్లో ఎలాంటి ఒత్తిడి లేదు. అమ్మనాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. క్రమశిక్షణతో ఒత్తిడి లేకుండా చదివినందువల్లే అనుకున్నది సాధించాను. రెండు ప్రయత్నాల్లో ఫలితం రాలేదు. ఇది మూడో అటెంప్ట్. 207వ ర్యాంకు వచ్చింది.
లక్ష్యాన్ని సాధించాను
కంకణాల రాహుల్ రెడ్డి(ర్యాంక్ 218)
ఐఏఎస్ సాధించాలన్నది నా లక్ష్యం. నాన్న దేవేందర్రెడ్డి ఎల్ఐసీ ఏజెంట్. అమ్మ అరుణ గృహిణి. 2018లో బీటెక్ పూర్తి చేశాను. రోజుకు 14 గంటలు కష్టపడి చదివాను. అశోక్నగర్లోని ఏకేఎస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాను. మొదటి ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు రాలేదు. రెండో ప్రయత్నంలో 218 ర్యాంకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
లక్ష్యం.. ఐఏఎస్ -వర్షిత ఆడెపు (ర్యాంక్ 413)
మాది హన్మకొండ జిల్లా న్యూరాయపురా. నాన్న ఆడెపు రాజకట్టమల్లు. అమ్మ రాధారాణి. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ, అమ్మ టైలరింగ్ చేస్తూ నన్ను, అక్కను చదివించారు. మా అక్క మానస ఎంబీబీఎస్ పూర్తి చేసి ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్లో పని చేస్తున్నది. నేను 2017లో సీబీఐటీలో బీటెక్ పూర్తి చేశాను. ఇప్పటి వరకు మూడు సార్లు సివిల్స్ రాశాను. ఈ సారి ఎలాగైనా ర్యాంకు సాధించాలని పట్టుదలతో చదివా. అందుకోసం ఢిల్లీలో 10నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. తరువాత సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకుని ప్రిపేరయ్యా. 413 ర్యాంకును సాధించడం ఆనందంగా ఉంది. ఈ ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశముంది. కానీ నా లక్ష్యం ఐఏఎస్ కావడమే. అందుకోసం మళ్లీ సివిల్స్ రాస్తాను.
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
-అభిషేక్ అందాసు( ర్యాంక్ 616)
మాది హైదరాబాద్ సిటీ. నాన్న రవీందర్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. అమ్మ కవిత గృహిణి. 2018లో ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పాసయ్యాను. బాలలత మేడం దగ్గర ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నా. ప్రస్తుతం నాకు వచ్చిన ర్యాంకుతో ఐఏఎస్ రాదు. మళ్లీ ప్రిపేర్ అవుతా. తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతో ఉంది. ఐఏఎస్ అధికారి కావడమే నా జీవితాశయం.
మూడో ప్రయత్నంలో..
-ప్రశాంత్ (ర్యాంక్ 498) (ఏపీ)
నేను సివిల్స్ కోసం కష్టపడి ప్రిపేరయ్యాను. మూడో ప్రయత్నంలో 498వ ర్యాంక్ వచ్చింది. తండ్రి బాబురావు ఆర్మీలో పనిచేసి చనిపోయారు. తల్లి స్వర్ణలత గృహిణి. మా స్వస్థలం గుంటూరు. రోజుకు 8-10 గంటలు కష్టపడ్డాను. నా ర్యాంక్కు ఐపీఎస్ పోస్టు వస్తుందనుకొంటున్నా. మూడో ప్రయత్నంలో పట్టుదలతో చదవడం. తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణతో ఈ ర్యాంక్ను సాధించాను.