చెన్నై : కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్డౌన్, కర్ఫ్యూ వంటి కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించే వారినుంచి చెన్నై కార్పొరేషన్ మే 6 నుంచి ఇప్పటివరకూ రూ 28 లక్షల జరిమానా వసూలు చేసింది. నగరంలోని 15 జోన్లకు చెందిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, పోలీసులు ఈ జరిమానాలను వసూలు చేశారు.
వలసరవాక్కం జోన్ నుంచి అత్యధిక మొత్తాన్ని అధికారులు లాక్డౌన్ ఉల్లంఘనుల నుంచి వసూలు చేశారు. కొవిడ్-19 మార్గదర్శకాలకు విరుద్ధంగా షాపులు తెరిచిన వ్యాపారుల నుంచి జరిమానా వసూలు చేశామని అధికారులు తెలిపారు. ఇక తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 33,658 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 303 మంది ప్రాణాలు కోల్పోయారు.