మేడ్చల్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఆదర్శవంతంగా మార్చాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. సీఎం దత్తత గ్రామాలైన కేశవాపురం, నాగిశెట్టిపల్లి మూడుచింతలపల్లి, లింగాపూర్, లక్ష్మాపూర్తాండాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దత్తత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిర్ల్యక్షం చేయవద్దన్నారు. గ్రామాల్లో చేపట్టిన 117 అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. కరోనా నేపథ్యంలో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
కేశవాపూర్ వద్ద నిర్మించతలపెట్టిన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు భూ సేకరణ ఎంత వరకు పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో శ్యాంసన్, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్ ఆర్ఆండ్బీ అధికారులు శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.