ముంబై: అమెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ దిగుమతి కోసం మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీ సిప్లా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను అనుమతి కోరినట్లు సమాచారం. సోమవారమే ఈ సంస్థ దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారమే డీసీజీఐ వారికి అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మోడెర్నా అనేది ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఇది 90 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
ఇప్పటికే చాలా ధనిక దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. అమెరికాలో ఫైజర్, మోడెర్నా కలిపి ఇప్పటి వరకూ 12 కోట్ల మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధర, ఉత్పత్తి పరిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ సమస్యలు వంటివి ఉండటం ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అడ్డంకిగా మారింది.