చండీగఢ్: హర్యానాలో ఆందోళన చేస్తున్న రైతుల తలలు పగులగొట్టండని పోలీసులకు ఆదేశించిన ఐఏఎస్ అధికారిని సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్. ఆ అధికారి ఎంచుకున్న పదాలు సరికావేమో కానీ.. అక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉన్నదని ఖట్టర్ అన్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి అక్కడ కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అయినా ఆ అధికారి ఎంచుకున్న పదాలు మాత్రం సరికాదు. ఆ అధికారిపై ఏదైనా చర్య తీసుకోవాలంటే ముందుగా దానిపై జిల్లా యంత్రాంగం అంచనా వేయాలి. డీజీపీ కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు అని ఖట్టర్ చెప్పారు.
శనివారం కర్నాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్న బీజేపీ సమావేశానికి రైతులు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వాళ్లపై లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి తలలు పగిలాయి. అయితే అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి రైతులను అడ్డుకోవడానికి తలలు పగులగొట్టండని చెప్పిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా చెప్పారు.