పాట్నా: బీహార్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్టీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ను లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కలిశారు. బుధవారం తేజస్వి యాదవ్ నివాసానికి వెళ్లిన చిరాగ్, ఈ నెల 12న తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తొలి వర్థంతి సందర్భంగా జరిగే స్మారక కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాన్ని వారిద్దరు గుర్తు చేసుకున్నారు.
‘మా మధ్య పాత కుటుంబ సంబంధాలున్నాయి. మా నాన్న, లాలూ యాదవ్ చాలా ఏండ్లు కలిసి పనిచేశారు. అలాంటి కార్యక్రమంలో లాలూజీ పాల్గొనాలని నా తండ్రి కోరుకునేవారు’ అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. గురువారం ఢిల్లీలో లాలూను స్వయంగా కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
సీఎం నితీశ్ కుమార్ను ఆహ్వానిస్తారా అని చిరాగ్ను మీడియా ప్రశ్నించగా, అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ‘నేను సమయం అడిగాను కానీ, ముఖ్యమంత్రిని కలవడం అంత సులభం కాదు. ముఖ్యంగా నా విషయానికి వస్తే, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు చిరాగ్, తాను కుటుంబ సభ్యులమని తేజస్వి యాదవ్ అన్నారు. 2010లో తామిద్దరం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ నుంచి ఎంతో నేర్చుకున్నామని చెప్పారు. తన తండ్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం సహకరిస్తే పాశ్వాన్ స్మారక కార్యక్రమానికి తప్పక హాజరవుతారని అన్నారు. ఆయన మరణం తమకు చాలా బాధకలిగించిందని తెలిపారు. చిరాగ్కు సీఎం నితీశ్ అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
కాగా, ఇరు పార్టీల కూటమి గురించి ఇద్దరూ సమాధానాన్ని దాటవేశారు. ఈ రోజు సమావేశంలో రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరుగలేదని చిరాగ్ తెలిపారు. ఆయన బాబాయ్ పశుపతి పరాస్ ఎల్జేపీని తన ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో తేజస్వితో చిరాగ్ కలిసి పని చేస్తే బాగుంటుందని లాలూ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై మీడియా ప్రశ్నించినప్పటికీ చిరాగ్ పాశ్వాన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.