న్యూఢిల్లీ: చిరాగ్ పాశ్వాన్పై తిరుగుబాటు చేసి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో చీలిక తెచ్చిన అతని చిన్నాన్న పశుపతి పరాస్కు ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే, దీనిపై చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ మండిపడింది. పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తిని ఎల్జేపీ సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించింది. ఈ విషయంలో లోక్సభ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. ఎల్జీపీ అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్ ఏకే వాజ్పాయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్ర మాజీ మంత్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతి కుమార్ పరాస్ ప్రస్తుతం హజీపూర్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల ఆయన చిరాగ్ పాశ్వాన్పై తిరుగుబాటు చేసి ఎల్జేపీని చీల్చారు. మొత్తం ఐదుగురు ఎల్జేపీ సభ్యుల్లో చిరాగ్ పాశ్వాన్ మినహా మిగతా నలుగురు ఏకమై చిరాగ్ను పార్టీ పార్లమెంటరీ పక్షనేత పదవి నుంచి తొలగించారు. చీలికకు ప్రతిఫలంగా కేంద్రం ఇప్పుడు పరాస్కు మంత్రిపదవి ఇవ్వడంతో ఎల్జేపీ కోర్టును ఆశ్రయించింది.