‘ఎన్నో ఘోరము లెన్నో కష్టములతో నీనాడు స్వాతంత్య్ర సం/ పన్నంబైనది భారతంబు; మరలన్ బ్రత్యగ్ర సిద్ధాంతముల్,/ సన్నాహంబులు, భావభేదములు, స్వేచ్ఛావృత్తు లుద్రేకముల్/ పన్నాగంబులు రేపి శాంతిసుఖముల్ భంజింపకోయీ! సఖా!’ అని కేశవపంతుల నరసింహశాస్త్రి స్వాతంత్య్ర తొలినాళ్లలో, యాభైయవ దశకంలోనే మనకు హితబోధ చేశారు. రక్తతర్పణలతో సాధించుకున్న స్వతంత్ర భారతావనిలో సిద్ధాంత రాద్ధాంతాలు, భావ భేదాలతో శాంతి సౌభాగ్యాలను దూరంచేసే ప్రయత్నాలను అనుమతించరాదన్న హెచ్చరిక కూడా అందులో ఉన్నది. ఆ ఎరుకతోనే ఇవ్వాళ దేశంలోని స్థితిగతులను సమీక్షించుకోవాలి. మన మువ్వన్నెల జెండాను ఆధునిక ప్రపంచ అభివృద్ధి శిఖరాల మీద గర్వంగా ఎగురవేయాలి. 75 ఏండ్ల స్వేచ్ఛాభారతం సాధించిన విజయాలను, భవిష్యత్ ఆకాంక్షలను ప్రపంచానికి చాటుతూ ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశ నలుమూలలా జెండా వేడుకలు జరుపుకోవాలనే నిర్ణయం సముచితం, సంతోషదాయకం.
డబ్భు ఐదేండ్ల జెండా పండుగను ఘనంగా జరిపేందుకు దేశవ్యాప్తంగా 259 మందితో ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి కమిటీతో ప్రధాని మోదీ సంభాషించారు. వర్చువల్గా సాగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొని ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుతామని వెల్లడించడం హర్షణీయం. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన, సంజీవయ్య పార్క్లోగల జెండా వంటివే రాష్ట్రవ్యాప్తంగా 75చోట్ల ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 దాకా 75 వారాలపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్వాతంత్య్రోద్యమ తరం అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో దేశ భక్తిని పెంచుతాయనటంలో సందేహం లేదు.
డబ్భుఐదు వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో స్వతంత్ర భారతం ఎంతో సాధించింది, మరెంతో సాధించాల్సిఉంది. ‘మేడ మిద్దెల మీద మింటి చుక్కల వంటి వేయిరంగుల వెల్గు వింత దీపాలు, ఊరి వెలుపలనున్న పూరిగుడిసెల దూరి, లోని చీకటి బాపలేని దీపాలు..’ అని ప్రజాకవి కాళోజీ అన్నట్టు స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాల్సి ఉంది. సవాళ్లకు వెరవకుండా, దాటొచ్చిన అగడ్తలను చూసి ఆత్మైస్థెర్యంతో ముందడుగు వేయాల్సిన సమయమిది. తత్తవేత్త సెలక్లెర్ లూయి అన్నట్టు- ‘కొన్ని లోపాలున్నప్పటికీ, మొత్తంగా చూస్తే.. ప్రజాస్వామ్యం ప్రతి సామాన్య పౌరుడికి అదివరకెన్నడూలేని ఆత్మగౌరవాన్ని ప్రసాదించింది’ అనేది వాస్తవం.