న్యూఢిల్లీ: భారత్తో ఉద్రిక్తతల నివారణకు చర్చలే ప్రాధాన్యమన్న చైనా తన వక్ర బుద్ధిని చాటింది. తూర్పు లడఖ్, ఉత్తర సిక్కింలోని నాకు లా సమీపంలో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తున్నది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని ఎక్కువ కాలం మోహరించేందుకు ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది. తన సైన్యాన్ని తక్కువ సమయంలో ఎల్ఏసీ వద్దకు పంపేలా సరిహద్దు సమీపంలో శాశ్వత కాంక్రీట్ శిబిరాలను చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో చైనా నిర్మించిన ఈ శాశ్వత భవనాలను భారత నిఘా సంస్థలు గుర్తించాయి.
ఉత్తర సిక్కింలోని నాకు లాకు కొన్ని కిలోమీటర్ల దూరంలో చైనా నిర్మాణాలను గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్, అరుణాచట్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో కూడా చైనా నిర్మించిన కాంక్రీట్ శిబిరాలను గుర్తించినట్లు వెల్లడించాయి. ఆ సైనిక శిబిరాల నుంచి ఎల్ఏసీకి త్వరగా చేరుకునేలా రహదారి సదుపాయాలను కూడా చైనా అభివృద్ధి చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతాల్లోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను చైనా సైనికులు తట్టుకోలేక పోతున్నారని, ఈ ఆధునిక, భద్రతాపరమైన కాంక్రీట్ శిబిరాల నిర్మాణాలతో ఆ సమస్యను చైనా అధిగమిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.