న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలను గర్భిణులకు ఇవ్వవచ్చు అని కేంద్ర ఆరోగ్యశాఖ తన మార్గదర్శకాల్లో సూచించిందని, ప్రెగ్నెంట్ మహిళల్లో వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందని, వారికి టీకాలు ఇవ్వాల్సిందే అని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ తెలిపారు. సార్స్ సీవోవీ2 వేరియంట్లు అయిన ఆల్పా, బీటా, గామా, డెల్టాలపై కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 12 దేశాల్లో డెల్టాప్లస్ కేసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇండియాలో 50 కేసులను గుర్తించినట్లు తెలిపారు. డెల్టా ప్లస్ వైరస్ను ఐసోలేట్ చేసి కల్చర్ చేస్తున్నామని, మిగితా వేరియంట్లకు చేసిన పరీక్షలనే చేస్తున్నామని, ల్యాబ్ల్లో వ్యాక్సిన్ సమర్థతను పరీక్షిస్తున్నామని, మరో పది రోజుల్లో ఫలితాలు వస్తాయని బలరామ్ భార్గవ్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక దేశం పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు. అయితే మరి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అవసరమా అన్నది ఇంకా తెలియని ప్రశ్నగానే మిగిలిపోయిందన్నారు. డేటా పూర్తిగా తెలియనంత వరకు.. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వలేమని బలరామ్ భార్గవ్ వెల్లడించారు. అయినా తాము ఓ చిన్నపాటి స్టడీ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాటి ఫలితాలు సెప్టెంబర్ వరకు వస్తాయన్నారు. కానీ పిల్లల వ్యాక్సినేషన్పై అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయని, వారికి వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అన్న కోణంలో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లో డెల్టా పాజిటివ్ వచ్చిన ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.