న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సోమవారం కలిశారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు నౌకాదళం చేస్తున్న వివిధ సహాయక కార్యక్రమాల గురించి వివరించారు. నేవీ అధికారులు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిశారని, ఆసుపత్రుల పడకలు, రవాణా, ఇతర సహాయ సహకారాల గురించి అడిగి అవసరమైన సహాయాన్ని అందజేశారని తెలిపారు.
పలు నగరాల్లోని నేవీ ఆసుపత్రులలోనూ సాధారణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నట్లు ప్రధాని మోదీకి అడ్మిరల్ కరంబీర్ సింగ్ వివరించారు. నేవీలోని వైద్య సిబ్బందిని దేశంలోని పలు ప్రాంతాలకు తరలించి కరోనా నిర్వాహణ విధులు అప్పగించినట్లు వెల్లడించారు. నేవీలో శిక్షణ పొందుతున్న నర్సింగ్ సిబ్బందిని కూడా కరోనా విధుల్లో మోహరించనున్నట్లు మోదీకి చెప్పారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.