న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సోమవారం కలిశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి సాయుధ దళాలు చేపడుతున్న సన్నాహాలు, సహాయ కార్యకలాపాలను వారిద్దరు సమీక్షించారు. గత 2 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసిన లేదా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన సాయుధ దళాలకు చెందిన వైద్య సిబ్బందిని వారి ప్రస్తుత నివాస స్థలానికి సమీపంలోని కరోనా కేంద్రాల్లో సేవలందించాలని కోరినట్లు మోదీకి రావత్ వివరించారు. పదవీ విరమణ చేసిన ఇతర వైద్య అధికారులు అత్యవసర హెల్ప్లైన్ల ద్వారా సంప్రదింపుల కోసం తమ సేవలను అందించాలని కోరినట్లు చెప్పారు. ఆర్మీ కమాండ్ ప్రధాన, కార్ప్స్, డివిజన్ ప్రధాన కార్యాలయాలతోపాటు నేవీ, ఐఎఎఫ్ విభాగాల్లోని సిబ్బందిని కూడా ఆసుపత్రులలో నియమించినట్లు ప్రధాని మోదీకి రావత్ వివరించారు. ఆసుపత్రులలో నర్సింగ్ సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో నియమించినట్లు వెల్లడించారు.
సాయుధ దళాలకు చెందిన సంస్థల వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు పరఫరా చేస్తున్నట్లు సీడీఎస్ రావత్ ప్రధాని మోదీకి వివరించారు. అధిక సంఖ్యలో వైద్య సదుపాయాల ఏర్పాటు, సాధ్యమైన చోట సైనిక వైద్య మౌలిక సదుపాయాలను పౌరులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి ఆక్సిజన్, ఇతర నిత్యావసరాలను రవాణా చేయడానికి వాయుసేన చేపడుతున్న కార్యకలాపాలను ప్రధాని మోదీతో రావత్ సమీక్షించారు.
కేంద్రీయ, రాష్ట్రీయ సైనిక్ వెల్ఫేర్ బోర్డులు, ప్రధాన కార్యాలయాల్లోని అధికారులను మారుమూల ప్రాంతాలతో సహా సాధ్యమైనంతవరకు మాజీ సైనికులు, మాజీ అధికారులకు వైద్య, ఇతర సేవలు అందించేందుకు సమన్వయం చేసుకోవడంపై ప్రధాని మోదీ, సీడీఎస్ రావత్ చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.