కరోనా వైరస్ సెకండ్వేవ్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రో రైలు ప్రయాణికుల భద్రతకు కొవిడ్-19 నిబంధనలు అమలు చేస్తున్నామని ఎల్అండ్టీ మెట్రో అధికారులు గురువారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికుల సంక్షేమం, భద్రతకు మెట్రో కట్టుబడి ఉందన్నారు. ప్రయాణికులంతా తప్పనిసరిగా భౌతిక దూరం, మాస్కులను ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడం, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడం వంటి చర్యలను ఆచరించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధిస్తామని తేల్చి చెబుతున్నారు.
మెట్రో రైల్లో ప్రయాణించే వారు ముందుగానే మొబైల్ క్యూఆర్ కోడ్తో కూడిన టిక్కెట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫోన్పే, మేక్ మై ట్రిప్, పేటీఎం, టీ-సవారీ వంటి యాప్లను వినిగియోగించడం ద్వారా విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. కాంటాక్ట్ లెస్ ప్రయాణాలు చేస్తూనే, కౌంటర్ల వద్ద క్యూలలో నిలబడే బాధలను తప్పించుకునేలా టికెట్లను అందుబాటులో ఉన్న యాప్లలో కొనుగోలు చేయాలని సూచించారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని మూడు కారిడార్లలో నడుస్తున్న రైళ్లను ప్రారంభానికి ముందే డిపోల్లో శానిటైజ్ చేసి ప్రయాణికులను అనుమతిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు తరచూ తాకే ప్రదేశాలను కూడా నిర్దేశిత సమయాల్లో శానిటైజ్ చేస్తున్నామని, ప్రతి మెట్రో రైలులో సీటు వదిలి సీటులో కూర్చునేలా సూచికలు, భౌతిక దూరం పాటించేలా గుర్తులను ప్రదర్శించామన్నారు.
కరోనా వైరస్ మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెట్రో ప్రయాణికులు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మెట్రో రైళ్లకు సంబంధించిన ప్రత్యేక జాగ్రత్తలు రోజూ తీసుకుంటున్నాం. మెట్రో స్టేషన్లలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. ప్రయాణికులను నిరంతరం అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకొని మెట్రోలో సురక్షిత ప్రయాణం జరిగేలా చేస్తున్నాం. – కేవీబీ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో సీఈవో, ఎం.డీ.