అభివృద్ధిని అడ్డుకోవడమేప్రతిపక్షాల ఎజెండా
ప్రజల గుండెల్లోంచి నన్ను, టీఆర్ఎస్ను విడదీయలేరు
విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్
కేంద్రం వివక్ష చూపుతోంది: ఖమ్మం ఎంపీ నామా
నేడు ఖమ్మంలో రాష్ట్ర హోంమంత్రి పర్యటన
ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతిపక్ష నేతలు అబద్ధాల ప్రచారంతో ప్రజల మనసును గెలవలేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండాగా విపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు కలలో కూడా తానే కన్పిస్తున్నానని, తనను కలవరించకుండా వారికి ఒక్కరోజు కూడా నిద్రపట్టడంలేదని ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సహించలేకనే కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా నగర ప్రజల గుండెల్లోంచి తననుగానీ, టీఆర్ఎస్ను తొలగించడం, అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరమూ కాదని స్పష్టం చేశారు. కేఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని వర్గాల వారికి టికెట్లు ఇచ్చి సముచిత ప్రాధాన్యం కల్పించిందని అన్నారు. తాను ఎవరినీ బెదిరించాల్సిన అవసరంలేదని, తన పేరిట విడుదలైన ఆడియో నకిలీదని, అది తన స్వరమే కాదని స్పష్టం చేశారు. మధిర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోలేని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క.. ఇప్పుడు ఖమ్మంలో ఏంచేస్తారని ప్రశ్నించారు. నగరంలో టీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి భట్టి భయపడుతున్నారని అన్నారు. నగర అభివృద్ధి కన్నా టీఆర్ఎస్కు వస్తున్న సానుకూలతను అడ్డుకోవాలన్నదే కాంగ్రెస్, సీపీఎం పక్షాల ఎజెండా అని విమర్శించారు. కేఎంసీ ఎన్నికల్లో 60 సీట్లూ గెలిస్తే అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందన్నారు.
నగరం సరికొత్తగా ఆవిష్క్రతమైంది: ఎంపీ నామా
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో గతంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధికి పోల్చితే ఎంతో ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. ఇది ఖమ్మం నగరమేనా అనేలా ఉందని అన్నారు. నగర అభివృద్ధికి నిరంతరం శ్రమించిన మంత్రి అజయ్ అభినందనీయుడని అన్నారు. 60 స్థానాలూ గెలిపించి ప్రజలు తమ కృతజ్ఞతను చాటుకుంటారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో అన్ని స్థానాలనూ టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం మానాలని సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు చంద్రావతి, మదన్లాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నాయకులు స్వర్ణకుమారి, ఆర్జేసీ కృష్ణ, కృష్ణచైతన్య, వనమా రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.