రాజకీయ, అధికార వర్గాల్లో విస్మయం
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య సలహాదారు పీకే సిన్హా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నట్టు ఆయన పేర్కొన్నారని సమాచారం. మోదీకి అత్యంత నమ్మకస్థుడిగా పేరొందిన సిన్హా రాజీనామా చేయడం రాజకీయ, అధికార వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. క్యాబినెట్ మాజీ కార్యదర్శి అయిన సిన్హా… 18 నెలల పాటు మోదీకి ముఖ్య సలహాదారు పదవిలో కొనసాగారు. సిన్హా కోసమే 2019లో ప్రధాని కార్యాలయం (పీఎంవో)లో ఆ పోస్టును సృష్టించారు. ప్రధాని పదవీకాలంతో సమానంగా ముఖ్య సలహాదారు కూడా కొనసాగుతారని అప్పుడే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1977 బ్యాచ్ యూపీ క్యాడర్ అధికారి అయిన సిన్హా ప్రభుత్వంలో అత్యంత సీనియర్ బ్యూరోక్రాట్. కేంద్రక్యాబినెట్ కార్యదర్శిగా నాలుగేండ్లకు పైగా పనిచేశారు. మోదీ మొదటి టర్మ్లో ఆయనే క్యాబినెట్ కార్యదర్శి. 2019లో పదవీ విరమణ చేశారు. అదే ఏడాది మోదీ మళ్లీ అధికారంలోకి రావడంతో సిన్హాను పీఎంవోలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. మరో ఉన్నతాధికారి నృపేంద్ర మిశ్రాను పీఎంవో నుంచి బదిలీ చేశాక… ముఖ్య సలహాదారుగా సిన్హా నియమితులయ్యారు.