ఆ మేనరిజం మెస్మరైజ్ చేస్తుంది.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఆయన సినిమా వస్తుందంటే కోట్ల మంది అభిమాన గణానికి పూనకం వస్తుంది.. సినిమా థియేటర్లలో పూల జల్లు కురుస్తుంది. ఆయనే సినీ సూపర్స్టార్ రజినీకాంత్.. సినీ అభిమానులకు ఆయన పేరే ఓ మంత్రం. సినీ పరిశ్రమలో ఆయన అలుపెరుగని యంత్రం.. 70 ఏండ్ల వయసులోనూ 25 ఏండ్ల కుర్రాడు! 50 ఏండ్లుగా వెండితెరపై ఆయన పోషించని పాత్రలేదు.
సినిమా తెరపై ఎంత హీరోయిజం చూపిస్తారో.. నిజ జీవితంలో అంత సాదాసీదాగా ఉండటం కేవలం రజినీకే చెల్లింది. దశబ్దాలుగా సినీ పరిశ్రమను శాసిస్తున్న రజినీకాంత్ను భారతీయ సినీరంగంలోనే అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
‘నాలోని ప్రతిభను మొదట గుర్తించిన నా మిత్రుడు, బస్ డ్రైవర్ రాజ్బహదూర్, నా కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నా అన్న సత్యనారాయణరావ్ గైక్వాడ్, నేటి రజినీకాంత్ను సృష్టించి సినీ దర్శకుడు కే బాలచందర్.. ఇంకా ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు.. అందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నా. –రజినీకాంత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దక్షిణ భారత సినీరంగం తలైవా (నాయకుడు) అని సగౌరవంగా పిల్చుకునే సూపర్స్టార్ రజినీకాంత్ (70)కు.. భారతీయ సినీరంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. సినీరంగానికి గత 50 ఏండ్లుగా రజినీకాంత్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించినట్టు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ గురువారం ప్రకటించారు. సినీ ప్రముఖులు ఆశాభోంస్లే, మోహన్లాల్, బిశ్వజిత్ చటర్జీ, శంకర్మహదేవన్, సుభాష్ఘాయ్తో కూడిన ‘అవార్డు ఎంపిక కమిటీ’ 2019 ఏడాదికి ఈ అవార్డుకు రజినీకాంత్ను ఏకగ్రీవంగా ఎంపికచేసింది.
సినీరంగంలో తన ఎదుగుదలకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ దాదాసాహెబ్ అవార్డును అంకితం ఇస్తున్నానని రజినీకాంత్ ప్రకటించారు. తనకు అవార్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి, కేంద్రానికి, అవార్డు జ్యూరీకి రజినీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సినీరంగంలోనే అత్యున్నత అవార్డుకు ఎంపికైన రజినీకాంత్కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన నట ప్రతిభతో కొన్ని తరాలను అలరించిన రజినీకి దాదాసాహెబ్ పురస్కారాన్ని ప్రకటించటం సరైన గుర్తింపు అని ప్రధాని మోదీ అన్నారు.
ఎన్నికల ప్రయోజనం కోసం కాదు: జవదేకర్
తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 6న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఉనికిని చాటాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసమే రజినీకి అవార్డు ప్రకటించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటిని కేంద్రమంత్రి జవదేకర్ తోసిపుచ్చారు. 50 ఏండ్లుగా సినీరంగానికి రజినీ సేవచేస్తున్నారన్నారు. మే 3న రజినీకాంత్కు రాష్ట్రపతి అవార్డును అందజేస్తారన్నారు.
మహారాష్ట్రలో కుటుంబ మూలాలు
కుటుంబం స్థిరపడింది బెంగళూరులో
కండక్టర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి
తమిళ సినీ రంగంలో ఎంజీ రామ్చంద్రన్ (ఎంజీఆర్) తర్వాత ఆ స్థాయి హీరోగా జన నీరాజనాలను అందుకుంటున్న రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. తండ్రి రామోజీరావు గైక్వాడ్. ఆయన పోలీస్ కానిస్టేబుల్గా పని చేసేవారు. రజినీకి తొమ్మిదేండ్ల వయసున్నప్పుడే ఆయన తల్లి చనిపోయారు. రజినీకాంత్ కుటుంబ మూలాలు మహారాష్ట్రలోని పుణెకు చెందినవి. రజినీ పుట్టేటప్పటికే వారి కుటుంబం నాటి మైసూర్ స్టేట్లో (నేటి కర్ణాటకలో) స్థిరపడింది. 12 డిసెంబరు 1950న బెంగళూరులో రజినీ జన్మించారు. నలుగురు సంతానంలో రజినీయే చిన్నవారు.
రజినీ ప్రాథమిక విద్య బెంగళూరులోని గవిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ పాఠశాలలో సాగింది. తర్వాత రజినీని ఆయన అన్న బెంగళూరు రామకృష్ణ మఠంలో చేర్పించారు. చదువయ్యాక కొంతకాలం కూలీగా పనిచేశారు. బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో కండక్టర్గా చేరారు. అక్కడే డ్రైవర్గా పనిచేసిన తన మిత్రుడు రాజ్బహదూర్ సూచనతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరిన రజినీ, తమిళ సినీ దర్శక దిగ్గజం కే బాలచందర్ ప్రోత్సాహంతో 1975లో అపూర్వ రాగంగల్ సినిమాలో తొలిసారి నటించారు. సినిమాల్లో తన అసాధారణ మేనరిజం, అబ్బురపరిచే నటనతోపాటు వ్యక్తిగత జీవితంలో నిరాడంబరతతో కోట్లమంది అభిమానులను రజినీ సంపాదించుకొన్నారు.
రజినీ కుటుంబం
రజనీ భార్య పేరు లత. వారికి ఇద్దరు కుమార్తెలు- ఐశ్యర్య, సౌందర్య. 2004లో నటుడు ధనుష్తో ఐశ్వర్య పెండ్లి జరిగింది. సౌందర్య తమిళ సినీ రంగంలో దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నారు.
రాజకీయంపై సుదీర్ఘకాలం ఊగిసలాట.. వెనక్కి!
జయలలిత తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు.. ఇవీ 1996లో ఎన్నికల్లో రజనీ చేసిన వ్యాఖ్యలు. ఇవే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమికి కారణమయ్యాయి. అప్పట్నుంచి రజినీ రాజకీయ రంగప్రవేశంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజకీయ పార్టీ పెడుతున్నట్టు రజినీ గతేడాది ప్రకటించారు. గత డిసెంబర్లో హైదరాబాద్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న యోచనను విరమించుకొంటున్నట్టు ప్రకటించారు.
ఆయనది ప్రత్యేకశైలి: సీఎం కేసీఆర్
రజినీకాంత్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని, దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజినీకాంత్కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్వీర్సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్, ప్రముఖ నటులు కమల్హాసన్, వెంకటేశ్ తదితరులు రజినీకి శుభాకాంక్షలు తెలిపారు.
‘నా ప్రియమిత్రుడిని దాదాసాహెబ్ఫాల్కే అవార్డు వరించడం మహానందంగా ఉంది. భారత సినీ పరిశ్రమకు నీవు అందించిన సేవలు వెలకట్టలేనివి. ప్రతిభ, కృషికి తగిన ప్రతిఫలమిది. నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’
-మెగాస్టార్ చిరంజీవి
‘నా మిత్రుడికి దాదాసాహెబ్ పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. అవార్డుకు అతను అన్ని విధాల అర్హుడు’
-మోహన్బాబు
‘అత్యున్నత పురస్కారానికి ఎంపికైన రజనీకాంత్గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. మీరు మాకు ఎల్లవేళలా స్ఫూర్తినిస్తారు. భారతీయ సినిమాకు మీరు చేసిన సేవలు అత్యంత విలువైనవి’
-మహేష్బాబు