రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మరోసారి ఆన్లైన్ ద్వారా మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మద్యం షాపులను మూసివేశారు. దీంతో మద్యం లభించక ఇటీవల కొందరు ఆల్కహాల్ కలిగిన హోమియో మందు సేవించి చనిపోయారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం కొనుగోలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు గత ఏడాది లాక్డౌన్ సమయంలో అమలు చేసిన మాదిరిగా ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్ఎంసీఎల్) వెబ్సైట్, యాప్ ద్వారా ఆదివారం నుంచి మద్యం ఆన్లైన్ బుక్కింగ్స్ను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఒక వ్యక్తి ఐదు లీటర్ల మద్యం మాత్రమే కొనుగోలు చేయాలి. మద్యం ధరతోపాటు ఇంటి వద్దకు పంపిణీకి అదనంగా రూ.100 బుకింగ్ సందర్భంగా ముందుగా చెల్లించాలి.
సోమవారం నుంచి హోమ్ డెలివరీ ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యాన్ని హోమ్ డెలివరీ చేస్తారు. స్థానిక కరోనా పరిస్థితులను అనుసరించి డెలివరీ సమయాలు మారుతుంటాయి. ఒక ప్రాంతంలోని 15 కిలోమీటర్ల పరిధిలోని వైన్ షాపుల నుంచి మద్యాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయాలి. అయితే ఏ షాపు హోమ్ డెలివరీ చేస్తుంది అన్నది సీఎసీఎంసీఎల్ నిర్ణయిస్తుంది.
కాగా, ఛత్తీస్గఢ్లో ఆన్లైన్లో మద్యం అమ్మకాలు, హోమ్ డెలివరీపై మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరోవైపు విపక్ష పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్, ఔషధాలపై దృష్టి సారించడం బదులు మద్యం అమ్మకాలపై శ్రద్ధ చూపడాన్ని విమర్శించాయి.
అయితే ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కవాసి లక్మా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. మద్యం స్మగ్లింగ్ను అరికట్టడం, మద్యం సేవించే వారు ఏది పడితే అది తాగకుండా ఉండేందుకే ఆన్లైన్లో మద్యం అమ్మకాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.