రాయ్పూర్: రోడ్డు అభివృద్ధి కోసం అధికారులు చెట్లను నరకకుండా ఉండేందుకు ఒక పర్యావరణ కార్యకర్త దేవుడి ఫొటోలు అంటిస్తున్నాడు. ఛత్తీస్గఢ్లో బలోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని తరౌడ్ నుంచి డైహాన్ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాలని పీడబ్ల్యూడీ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కోసం 2,900 చెట్లను నరకాల్సి ఉంటుందని తెలిపారు. అయితే చిన్నా పెద్దా చెట్లు కలిపి మొత్తంగా 20 వేల చెట్లను తొలగించే అవకాశమున్నదని పర్యావరణ పరిరక్షణ కార్యకర్త వీరేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెట్లను కాపాడుకునేందుకు గత కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు.
చెట్లను కాపాడేందుకు వీరేంద్ర సింగ్ తొలుత చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల కూడళ్ల వద్ద పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చెట్ల చుట్టూ రక్షణ దారాలు కట్టారు. తాజాగా వీరేంద్ర సింగ్, దేవతల ఫొటోలను చెట్లకు అతికిస్తున్నారు. చెట్లను కాపాడుకునేందుకు తనతో కలిసి రావాలని గ్రామస్తులకు ఆయన పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి అవసరమేనన్న వీరేంద్ర, దాని కోసం చెట్లను నాశంనం చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో వర్షాలు తగ్గాయని, చెట్లను ఇలా నరికేస్తూ పోతే పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.