ముంబై: మరాఠా రిజర్వేషన్ కోసం ఛత్రపతి శివాజీ వారసుడు, బీజేపీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి ఆందోళన చేపడుతున్నారు. శివాజీ పట్టాభిషేకం చేసిన రోజును పురస్కరించుకొని ఆదివారం రాయ్గడ్ కోటలో నిర్వహించబోయే కార్యక్రమానికి శంభాజీరాజే హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లు వేయాలంటూ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా పిటిషన్ పంపించారు.
ఇందులోనే మరాఠా విద్యార్థులకు హాస్టల్ వసతి, స్కాలర్షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్లను కూడా చేర్చారు. విద్య, ఉద్యోగాల్లో గత ప్రభుత్వం మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమంటూ మే 5వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. వారిని రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకురావడానికి మాత్రమే వాళ్లు వెనుకబాటుకు గురైనట్లుగా చెప్పడం సరి కాదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా 50 శాతం రిజర్వేషన్ కోటాను మించడానికి అసాధారణ పరిస్థితులు కూడా ఏవీ లేవని స్పష్టం చేసింది.