న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మరికొన్ని పరీక్షలను అధికారులు రద్దుచేశారు. ఈ నెల 18న జరుగాల్సిన నీట్-పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్గ్రాడ్యుయేట్) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ గురువారం తెలిపారు. యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. మరోవైపు, విదేశాల్లోని పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఇంటర్నేషనల్ బ్యాకులరేట్ (ఐబీ) సంస్థ నిర్వహించే పరీక్షలు రద్దయ్యాయి. దేశంలో 180 పాఠశాల లు ఐబీ కరికులంను అనుసరిస్తున్నాయి. ఇంకోవైపు, పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తూ హర్యానా నిర్ణయం తీసుకున్నది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వాయి దా వేస్తూ ఒడిశా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. 5, 8, 10వ తరగతుల్లోని విద్యార్థులను ప్రమో ట్ చేస్తున్నట్టు పంజాబ్ వెల్లడించింది. పాఠశాలలను మే 15 వరకు మూసివేయాలని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. 10, 12వ తరగతి పరీక్షలను మే 20 వరకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నది. కేసులు ఎక్కువగా ఉన్న పది జిల్లాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది.