చెన్నై: తమిళనాడులో అద్భుతం జరిగింది. చెన్నైలో వెంటిలేటర్ సపోర్ట్ ( Ventilator Support ) పై ఉన్న ఓ కోవిడ్ రోగి కోలుకున్నారు. పూర్తిగా ధ్వంసమైన ఊపిరితిత్తులకు డాక్టర్లు ఎక్మో చికిత్స చేపట్టారు. సుమారు 62 రోజుల పాటు ఎక్మో చికిత్స జరిగింది. ఎటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా.. అత్యధిక రోజులు ఎక్మో ట్రీట్మెంట్ పొందిన రోగి 56 ఏళ్ల మొహమ్మద్ ముదిజా రికార్డుకెక్కాడు. ఏప్రిల్ చివర్లో అతనికి కోవిడ్ సంక్రమించింది. అయితే అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోస వ్యవస్థ దెబ్బతినడంతో అతన్ని ఎక్మో చికిత్సపై ఉంచారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో ఆ రోగికి చికిత్స కొనసాగించారు.
వ్యాపారవేత్త అయిన ముదిజా.. నాలుగు వారాల వ్యవధి తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చూశాడు. అయితే సెకండ్ వేవ్ ఉదృతిగా ఉన్న సమయంలో అతనికి ఆ అవయవం దొరకలేదు. కానీ డాక్టర్లు అతనిపై ఆశ కోల్పోలేదు. ఎక్మో చికిత్స ఇచ్చిన అతనికి 9 వారాల తర్వాత ఊపిరితిత్తులు కుదుటపడ్డాయి. ప్రస్తుతం వీల్చైర్పై ఉన్నాడతను. ఇది నా రెండవ జన్మ, డాక్టర్లు చెప్పినట్లు చేశానన్నారు. చికిత్స సమయంలో ముదిజా అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లు డాక్టర్లు తెలిపారు. రెలా హాస్పిటల్లో ముదిజా ఎక్మో చికిత్స తీసుకున్నాడు. ఎక్మో ట్రీట్మెంట్కు ప్రతి నెలా 40 లక్షలు ఖర్చు అవుతుంది.