న్యూఢిల్లీ, ఆగస్టు 2: బంతి జాతికి చెందిన వెర్నోనియా అమిదాలినా(ఆఫ్రికన్ బిట్టర్ ప్లాంట్) ఆకు.. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో విశేషంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. యూపీలోని ప్రయాగ్ రాజ్కు చెందిన గోపాల్ తివారీ(72) ఈ ఆకులతో చాలా మందికి మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. రెండేండ్ల క్రితం ఎవరో చెప్తే వెర్నోనియా ఆకులను ఆయన భార్యకు ఇచ్చారు. ఆమె శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గింది. బాగా ప్రభావం కనిపించింది. అప్పటి నుంచి ఆయన ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచుతున్నారు. అవసరమైన వారికి ఆకులను అందజేస్తున్నారు. ఆకులను తీసుకొన్న 30 రోజుల తర్వాత ప్రభావం కనిపిస్తుందన్నారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఇంకా పరిశోధనలు జరుగాల్సి ఉన్నది.