చండీగఢ్: పంజాబ్కు 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న చరణ్జీత్ సింగ్ చన్నీ మరో ఘనతను కూడా సొంతం చేసుకోబోతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి దళితుడిగా కూడా ఆయన పేరు నిలిచిపోనుంది. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళితుడైన చరణ్జీత్ పేరును ఖరారు చేస్తూ ఆదివారం సాయంత్రం ఏఐసీసీ ఒక ప్రకటన చేసింది. కాగా చరణ్జీత్ మున్సిపల్ కౌన్సిలర్గా తన రాజకీయ జీవితం మొదలుపెట్టి చివరికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
ఖరార్ మున్సిపాలిటీకి కౌన్సిలర్గా ఎన్నికైన చరణ్జీత్.. అదే మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు చైర్మన్గా కూడా పనిచేశారు. 2007లో తొలిసారి చామ్కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 2012, 2017 ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో ఆయనకు పంజాబ్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది. 1972లో చామ్కౌర్ సాహిబ్ సమీపంలోని మాక్రోనా కలాన్ గ్రామంలో చరణ్జీత్ జన్మించారు.