చండీగఢ్, సెప్టెంబర్ 19: ఆదివారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ పంజాబ్ కొత్త సీఎంగా చరణ్జీత్ సింగ్ చన్నీని(49) ఎంపిక చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ‘పంజాబ్ కొత్త సీఎంగా రాష్ట్ర సీఎల్పీ చరన్జీత్ సింగ్ చన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది. రాష్ట్రం నుంచి సీఎం పదవిని చేపట్టనున్న తొలి దళితుడు ఆయనే. ఈ విషయాన్ని వెల్లడించడం చాలా సంతోషంగా ఉంది’ అని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హరీశ్ రావత్ సాయంత్రం ట్వీట్ చేశారు. అనంతరం చన్నీ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ను కలిశారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. పంజాబ్లో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. తమను గెలిపిస్తే దళిత వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. బీఎస్పీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న శిరోమణి అకాలీదళ్ కూడా ఇదే తరహా హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే దళితులను డిప్యూటీ సీఎం చేస్తామని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దళిత వ్యక్తిని ఎన్నికల ముందు సీఎంగా ఎంపిక చేసింది. పంజాబ్లో దళితుల జనాభా 32% ఉంటుందని అంచనా. చన్నీ మాల్వా బెల్డ్లో రూప్నగర్ జిల్లాలోని చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చన్నీ.. అమరీందర్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
జఖార్.. అంబికా.. సుఖ్జిందర్.. చివరకు చన్నీ..
పంజాబ్ కొత్త సీఎం ఎంపిక చేసే సమయంలో హైడ్రామా చోటు చేసుకొన్నది. ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఉదయం 11 గంటలకు జరుగాల్సిన సీఎల్పీ భేటీ వాయిదా పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీశ్ రావత్, అజయ్ మాకెన్, హరీశ్ చౌదరి చండీగఢ్లో ఓ హోటల్లో ఉండి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో తొలుత సునీల్ జఖార్ పేరు వినిపించింది. తర్వాత సీనియర్ నేత అంబికా సోనిని ఎంపిక చేస్తే ఆమె తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. తర్వాత, సుఖ్జిందర్ సింగ్ రంధావా పేరు బయటకు వచ్చింది. చివరికి చన్నీని సీఎంగా ఎన్నుకొన్నట్టు హరీశ్ రావత్ ట్వీట్ చేయడంతో హై డ్రామాకు తెరపడింది.