చండీగఢ్: ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు ఒక స్కూల్లో ట్రాఫిక్ పార్క్ను ఏర్పాటు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ పార్క్ ఎంతో ఆకట్టుకోవడంతోపాటు విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కలిగిస్తున్నది. రెడ్, ఎల్లో, గ్రీన్ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డును దాటడం గురించి విద్యార్థులకు స్కూల్ టీచర్లు వివరించారు. అలాగే స్కూల్ గోడలపై ట్రాఫిక్ సింబల్స్తోపాటు రోడ్డుపై ఆటలు ఆడటం ప్రమాదకరం అన్న సందేశాన్ని ఇచ్చే చిత్రాలను గీయించారు.
తమ స్కూలు విద్యార్థులకు ట్రాఫిక్ గురించి ఆచరణాత్మక విజ్ఞానం ఇవ్వడానికి ట్రాఫిక్ పార్కును ఏర్పాటు చేసినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సుఖ్పాల్ కౌర్ తెలిపారు. విద్యార్థులకు ట్రాఫిక్ భద్రతా నియమాల గురించి బోధిస్తామని, తద్వారా వారు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని ఆమె చెప్పారు. తాము ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ పార్క్ విద్యార్థులకు ఎంతో నచ్చిందని అన్నారు.