తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి
టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల పచారంలో మంత్రి జగదీశ్రెడ్డి
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 26 : కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎడారిగా మారిన నల్లగొండ జిల్లా తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం 11, 12, 13, 15, 18, 16వ వార్డుల్లో రోడ్షోలు, ప్రచారసభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఓటు బ్రహ్మాస్త్రం లాంటిదని, 2014, 18 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచివైపు ఆలోచించి కారు గుర్తుకు ఓటేస్తే పింఛన్లు ఒకేసారి రూ.2 వేలు, రూ.3 వేలు పెరిగాయని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ ఊహకందని విప్లవాత్మకమైన రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా అదే ఓటుతో అమలులోకి వచ్చాయని, ప్రజలు గమనించి నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఓటరు ఆలోచించి ఓటు వేసినందునే సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు. మోడీకి ఓటేస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెరిగి పేదల జేబులు చిల్లుపడ్డాయని, కేసీఆర్కు ఓటేస్తే పేదల కడుపు నిండుతుందన్నారు. కారు గుర్తు లేక పోతే మన బతుకులు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి అయ్యేవన్నారు. ఐదారేండ్ల నాడు ఆకలితో కరువులో రాష్ట్రం కేసీఆర్ సీఎం అయిన తరువాత దేశంలోనే వరి ఎక్కువ పండించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిందన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేసిన ఓటు వల్ల మీ బజారు బాగుచేయడం, రోడ్లు వేయడం, తాగునీరు అందించడం జరుగుతుందని అందుకు టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
టీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి : నేతి
శాసనమండలి డిప్యూటీ నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలను గెలిపిస్తే ప్రయోజనం ఉండదని, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నకిరేకల్ పట్టణం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సీఎం కేసీఆర్ సీఎం అయిన తరువాత మైనార్టీలకు, మత్య, గీత కార్మికులతోపాటు యాదవులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకున్నట్లు తెలిపారు. పేదలను అన్నివిధాలా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ను మర్చిపోకుండా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీల వల్ల ఒరిగిందేమీ లేదు..
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్ల ఒరిగేది ఏమీలేదని, వారి మాయమాటలు నమ్మి మోసపోకుండా పనిచేసే వారిని గెలిపించాలని కోరారు. అప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నడికుడి ఉమారాణీవెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, చింత సోమన్న ఆయా వార్డుల అభ్యర్థులు సునీత, వెంకన్న, సహనాజ్, వసంత, సుందర్, ఆయా వార్డుల పార్టీ ఇన్చార్జీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
iQoo 7: ఐకూ 7 సిరీస్లో రెండు 5G స్మార్ట్ఫోన్లు లాంచ్