అసెంబ్లీలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయంలో దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలో 4,5 నియోజకవర్గాల ప్రజలు నివాసముంటున్నారని, వారికి మంచిర్యాల కేంద్రబింధువని పేర్కొన్నారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పెద్దపల్లి, ఖానాపూర్, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు సైతం వైద్యానికి మంచిర్యాలకు వస్తుంటారని వివరించారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వందల కిలోమీటర్లు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని తెలిపారు. జిల్లా హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాలైతే 400 కిలోమీటర్లకుపైగా దూరం ఉంటాయని పేర్కొన్నారు. మంచిర్యాలలో మెడికల్ కాలేజీ కావాలని చిరకాలంగా జిల్లా వాసులు కోరుకుంటున్నారని సభ దృష్టికి తెచ్చారు. మంచిర్యాలలో దాదాపు 300 మంది వైద్యులున్నారని, 50 నర్సింగ్హోంలు ఉన్నాయని, 300 మంది అడ్వకేట్లు కూడా ఇటీవల వచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ను కోరారు.