కాకతీయులు అచ్చమైన తెలంగాణ రాజులు. ఈ ప్రాంతం నుంచి దండనాయకులుగా, రాజులుగా ఎదిగారు. కాకతీయ రాజుల్లో క్రీ.శ.900 ప్రాంతం వాడైన గుండయ్య (గుండన) రాష్ట్ర కూటులను ఆశ్రయించి యుద్ధాలలో పాల్గొన్నాడు. గుండయ్య రాష్ట్రకూటుడు, రాష్ట్రకూటాల పేరు పెట్టుకున్నాడు. కాకతీయులలో మొదట ఇద్దరు రాజులు ‘రాష్ట్రకూట’ అని పేరు పెట్టుకున్నారు. ఆ వీరుని కొడుకు ‘ఎరియ’ రాష్ట్రకూటుడు తెలంగాణలోని ‘కుర్రవాడి’ ప్రాంతానికి అధిపతి అయ్యాడు. ఎరియ తర్వాత అతని కొడుకు బేతన రాజయ్యాడు. అతని కొడుకు కాకర్త్య గుండన. ఈ గుండన కాలం నుంచే వీరు కాకర్త్య బిరుదును పొంది కాకతీయులైనాడు.‘కాకతి’ వారి ఇష్ట దేవత. ఆమె పేరు మీదుగానే కాకతీయులయ్యారు.
హన్మకొండ ప్రాంతంలో కాకతి నగరం నిర్మించుకొని రాజధానిగా చేసుకున్నారు. గుండన కుమారుడు బేతన చిన్నవయస్సువాడు. కాబట్టి రాజ్యం కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు విరియాల కామసాని అతన్ని చేరదీసి పశ్చిమచాళుక్యుల సహాయంతో తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించి బేతనను కాకతి రాజుగా నిలబెట్టింది. కాసె సర్వప్ప రాసిన ‘సిద్దేశ్వర చరిత్ర’ను బట్టి బేతన చిన్నవాడు కాబట్టి కామసాని కొంతకాలం రాజ్యం చేసిందని తెలుస్తున్నది. ఈ కామసాని ‘దుర్జయ’ వంశానికి చెందిన ఎర్రభూపతి భార్య. ఎర్రభూపతి సోదరిని కాకర్య గుండన వివాహమాడి ఉంటాడు. అందుకే గుండన ఒకానొక శాసనంలో ‘పెండ్లి గుండన’ అని పేర్కొనబడినాడు. కామసాని భర్త ఎర్రభూపతి ముదిగొండ చాళుక్యులతో చేసిన యుద్ధంలో అప్పటికే మరణించాడు.
రాజనీతిపరురాలైన కామసాని తన మేనల్లుడైన బేతనను చేరదీసి కొంత రాజ్యాన్ని నిలబెట్టింది. ఆ తర్వాత బేతన వీరుడుగా కాకతి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అతడు క్రీ.శ.1052 వరకు పాలించాడు. అతని తర్వాత ప్రోలరాజు, రెండో బేతరాజు, దుర్గరాజు క్రీ.శ.1116 వరకు కాకతి రాజ్యాన్ని పాలించారు.
కాకతీయుల్లో ప్రసిద్ధమైన వాడు బేతరాజు కుమారుడు రెండో ప్రోలరాజు. ఇతని కాలం నాటికి వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు వంటి రాజ్యాలు బలహీనమయ్యాయి. తూర్పు చాళుక్యులు కూడా మునుపటి రీతి అధికారంతో లేరు. పశ్చిమ చాళుక్యులు కొంత బలమైన రాజ్యంగా ఉన్నారు. రెండో ప్రోలరాజు కాలంలోనే కళచురి వంశపు బిజ్జ లుడు పశ్చిమ చాళుక్యరాజును చంపి రాజైనాడు. ఈ పరిస్థితులను చూసుకొని ప్రోలరాజు స్వతంత్రుడైనాడు. ప్రోలరాజు తర్వాత రుద్రదేవుడు రాజై దిగ్విజయ యాత్రలు చేశాడు. దుర్భేద్యమైన దుర్గంగా ఓరుగల్లును రూపొందించి రాజధానిగా చేసుకున్నాడు. ఆ తర్వాత మహాదేవుడు, గణపతి దేవు డు, రుద్రమదేవి, రెండో ప్రతాపరుద్రుడు ఓరుగల్లు రాజ్యాన్ని వైభవంగా పరిపాలించారు. గణపతి దేవుడి కాలంలోనే మొత్తం ఆంధ్రభాష మాట్లాడే ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకు వచ్చాయి. ఓరుగల్లుకు ‘ఆంధ్రనగం’ అని పేరువచ్చింది.