నవలా రచయిత అంపశయ్య నవీన్ తన 8వ కథా సంపుటి ‘యానాంలో ఒక రోజు’ 80వ పుట్టినరోజున విడుదల చేశారు. కొన్నేండ్లుగా తన ప్రతి పుట్టినరోజునా ఒకటి, రెండు పుస్తకాలను వెలువరించడమే గాక, ఎవరైనా రచయిత(త్రి) రాసిన మొదటి నవలకు బహుమతినివ్వడం అనే సాంప్రదాయాన్ని నవీన్ కొనసాగించడం ముదావహం.
ఈకథా సంపుటిలో ఉన్న 14 కథల్లో పదకొండింటిని రచయిత ఈ కరోనా కాలంలోనే అంటే తొమ్మిది నెలల వ్యవధిలో రాశారు. అందులో అయిదు కథలు రచయితే స్వయంగా కథ చెబుతున్నట్లుగా రాశారు. ఇందులోని మూడు కథలు ‘నడకేరా అన్నిటికీ మూలం’, ‘సమాంతర రేఖలు’, ‘వినోద యాత్ర’.. కరోనా అంశంగా వచ్చిన కథలే. రచయిత ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తూ మూలాల్లోకి వెళ్లి పరిశోధిస్తూ పాఠకుల్లో ఆలోచనను, అవగాహనను కలిగించే రచనలు చేయాలనేది యువరచయితలు నవీన్ నుంచి నేర్చుకోవాల్సినవి. సాంఘిక, ఆర్థిక , సామాజిక రంగాల్లో కరోనా చూపిన ప్రభావాన్ని ఈ మూడు కథల్లో వివిధ కోణాల్లో చూపించగలిగారు.
టైటిల్ కథ ‘యానాంలో ఒక రోజు’ ఈ కాలానికి తగిన కథ. ఇది కూడా రచయిత తానే ఒక పాత్రగా ఉన్న కథ. ఒక సాహిత్య సంస్థ వారిచే జీవనసాఫల్య పురస్కారం అందుకునేందుకు కాకినాడకు వెళ్లి మర్నాడు కొద్దిమంది సాహితీ మిత్రులతో కలిసి సరదాగా యానాం వెళ్తాడు రచయిత. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువ జంటలో అమ్మాయి తండ్రి తన కూతురు ఇష్టపడ్డది ఒక దళిత యువకుడిని అని తెలిసి తన పరువుకూ, హోదాకు భంగమవుతుందని వాళ్లిద్దర్నీ చంపించడానికి ప్రయత్నిస్తాడు. వాళ్లిద్దరూ పారిపోయి కాకినాడలో ఉన్న స్నేహితుడి దగ్గరికి వచ్చి అతని సహాయంతో పోలీస్స్టేషన్లో పెళ్లి చేసుకుంటారు. లాంచీలో తన అభిమాన రచయితను కలుసుకున్న ఆనందంలో తన కథంతా చెబుతుందా అమ్మాయి. రచయిత తనకు తెలిసినవాళ్ల ద్వారా ఆ జంటకు రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తాడు.
కథాంశాల విషయంలో రచయిత ఎంత ‘అప్డేట్’గా ఉండాలో ఈ కథ ద్వారా రచయిత మనకు తెలియజేస్తాడు. చుట్టూ ఉన్న నాగరిక సమాజంలో ఇంకా కులం, మతం, డబ్బు ముఖ్య పాత్ర వహించడం, వాటి మధ్య తేడాలను పరువుకు ప్రతీకగా తీసుకొని హత్యలు చేయించడం, కూతురు లేదా కొడుకు కంటే కూడా సో కాల్డ్ ప్రిస్టేజ్ ముఖ్యమనుకోవడం ఎంత దారుణమో ఈ కథ ద్వారా తెలియజేశారు.
నవీన్ మానసిక విశ్లేషణతో కథలు అద్భుతంగా రాస్తారు. మిగతా కథల్లో కూడా విశ్లేషణ ఉన్నా ఇన్డైరెక్ట్గా ఉంటుంది. కొన్ని కథలు ప్రత్యేకంగా హ్యూమన్ సైకాలజీ మీదనే ఆధారపడి ఉంటాయి. ‘రూపం-ప్రతిరూపం’ కథ ఆ కోవకే చెందినదే. తన రూపాన్ని తను అదే పనిగా చూడాలనుకునే ‘నార్ సిసిజం’ అనే మానసిక జబ్బు ఉన్న సునంద.. ఎవరి పెళ్లిలోనైనా, ఇతర ఫంక్షన్లోనైనా తను ఎక్కువ ఫొటోలు తీయించుకోవాలని కోరుకుంటుంది. అన్ని సందర్భాల్లో అది సాధ్యపడక పోయినా, ఇంట్లో వాళ్ల , దగ్గరి వాళ్ల శుభకార్యాల్లో నైనా ఆ కోరిక నెరవేరనపుడు తీవ్రమైన ఆశాభంగం చెంది అలకని, అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తుంది. చివరికి ఆమె ఎంత పరాకాష్టకు చేరుతుందంటే ఇంటి పెళ్లిలో తనను ఫొటో దిగడానికి పిలవనందుకు అలిగి ఫంక్షన్ హాల్లోంచి ఇంటికెళ్లి ఆ తెల్లవారి పుట్టింటికి వెళ్లిపోతుంది. సైకాలజిస్ట్ను సంప్రదిస్తే ఆమె ఫొటోలు దిగినప్పుడల్లా ఆ ఫొటోగ్రాఫర్తో చెప్పి వీలైనంత చెత్తగా, ఎక్కువ సంఖ్యలో తీయించి చూపిస్తే కొంతైనా మారే అవకాశముంటుందని చెప్తాడు. ఫొటోల పిచ్చిగాళ్లను మనం చూస్తూంటాం. కానీ, దాని వెనుక ఇంత కథ ఉందా అనిపిస్తుంది.
స్నేహబంధం ఎంత అమూల్యమో, అపురూపమో.. చివరికి మరణంలో కూడా కలిసే ఉన్న ఇద్దరు స్నేహితురాళ్ల జీవితాలు ఎలా ముగిశాయో ‘సృష్టిలో తీయనిది’ కథ ద్వారా, ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమాదరణలతో చూసుకునే కొడుకులు నేటి కాలంలో డబ్బు కోసం, ఆస్తుల కోసం మాటలతో, చేతలతో ఎంతగా హింసిస్తున్నారో ‘తండ్రులూ కొడుకులూ ’ కథలోనూ వివరిస్తారు రచయిత నవీన్.
ఈ సంపుటిలోని ప్రత్యేకత ఏమంటే.. ఇవన్నీ మన చుట్టూ ఉన్న మనుషుల వ్యక్తిత్వాలు. వీటి నిండా విభిన్న మనస్తత్వాల చిత్రీకరణ నిండి ఉంటుంది. ఏ పాత్రా మనకు తెలియని, పరిచయం లేని సమాజం నుంచి వచ్చినట్లు ఉండదు. ఇక కథాంశాల విషయానికి వస్తే.. ‘ఏం రాయాలో తెలియడం లేదు , మంచి సబ్జెక్టు దొరకడం లేదు’ అనే రచయితలకు ఇందులో చాలా కథలు పాఠాలు చెబుతాయి. మామూలు ఘటనను, సందర్భాన్ని, పరిస్థితిని ఆధారం చేసుకొని రచయిత తనదైన ముద్రతో అర్థవంతమైన కథగా ఎలా మార్చగలడో తెలుసుకోవడానికి కూడా ఈ కథలు చదవాలి.
నెల్లుట్ల రమాదేవి
94406 22781