న్యూఢిల్లీ, మార్చి 22: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో ఒకవైపు సామాన్యుడికి చుక్కలు కనిపిస్తుండగా, వాటిపై విధించే పన్నులతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రం కళకళలాడుతున్నది. పెట్రోల్, డీజిల్పై విధించే పన్నుల ద్వారా గత ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం 300 శాతం కంటే ఎక్కువ పెరిగింది. 2014-15లో పెట్రోల్, డీజిల్, సహజవాయువు ద్వారా కేంద్ర ఖజానాకు 5.4 శాతం ఆదాయం సమకూరగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 12.2 శాతానికి పెరిగింది. ఈ మేరకు సభ్యుల ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోక్సభలో సమాధానమిచ్చారు. ఆ వివరాలు…
మోదీ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన 2014-15లో పెట్రోల్పై రూ.29,279 కోట్లు, డీజిల్పై రూ.42,881 కోట్లు (రెండూ కలిపి మొత్తం రూ.72,160 కోట్లు) ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్పై కలిపి మొత్తంగా రూ.2.94 లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేసింది. అంటే ఆరేండ్లలో ఖజానాకు పెరిగిన ఆదాయం రూ.2,21,840 కోట్లు.నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య 15 నెలల్లో 9 విడుతల్లో లీటర్ పెట్రోల్పై రూ.11.77, లీటర్ డీజిల్పై రూ.13.47 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. కేంద్రం సుంకాలతో వినియోగదారుడికి రావాల్సిన ప్రయోజనాలన్నీ ప్రభుత్వ ఖజానాకు మళ్లాయి.