న్యూఢిల్లీ : మే 1 నుంచి 18-45 ఏండ్ల లోపు వారందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండటంతో ఈ ప్రక్రియకు ముందుగా రాష్ట్రాలు అదనంగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను అనుమతించాలని, ఆయా కేంద్రాల్లో రద్దీ లేకుండా ఉండేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ వయసు వారికి కేవలం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారానే వ్యాక్సినేషన్ చేపట్టాలని స్పష్టం చేసింది.
మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సిన్ వ్యూహంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కొవిడ్ కట్టడికి ఏర్పాటైన సాంకేతిక సాధికార కమిటీ చీఫ్ ఆర్ ఎస్ శర్మ శనివారం ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ దవాఖానలు, వ్యాపార..పారిశ్రామిక సంఘాలతో సంప్రదింపుల ద్వారా రాష్ట్రాలు అదనపు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో సూచించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల సిబ్బందికి వ్యాక్సినేషన్ తో పాటు కొవిన్ యాప్ వాడకం సంబంధిత అంశాలపై రాష్ట్రాలు శిక్షణ ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో కోరింది.