వెంగళరావునగర్, జూలై 8: వాకింగ్ కోసం వెళ్లిన ఓ యువకుడిపై గోడ కూలి మీద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. కల్యాణ్నగర్ ఫేజ్-3లో ప్రభాదిత్య ప్యాలెస్ అపార్ట్మెంట్లో నినసించే గంగాధర్రావు, సునీత దంపతుల కుమారడు ఎన్. ఆశిష్(25) ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. బుధవారం సాయంత్రం వాకింగ్ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆశిష్ తల్లి సునీత, సోదరి ఆశి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, భారీ వర్షానికి రాజీవ్నగర్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ గోడ కూలడంతో గురువారం బల్దియా సిబ్బంది శిథిలాలను తొలగిస్తుండగా, ఆశిష్ మృతదేహం బయటపడింది. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆశిష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. వాకింగ్ చేస్తూ.. గోడ పక్క నుంచి వెళ్తుండగా, అది కూలడంతో ఆశిష్ శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడి ప్రాణాలు కోల్పోయాడు. గోడ పడిపోయిన ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలై.. అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.