న్యూఢిల్లీ : మారుతి సుజుకి మాజీ ఎండీ, కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్ధాపకులు జగ్దీష్ ఖట్టర్ (78) గుండె పోటుతో సోమవారం మరణించారు. 1993లో మార్కెటింగ్ డైరెక్టర్ గా మారుతిలో చేరిన ఖట్టర్ 1999లో సంస్థ ఎండీగా ఎదిగారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీగా 2002లో కంపెనీ ఎండీగా తిరిగి నియమితులయ్యారు. 2007లో ఆయన పదవీవిరమణ చేసేంత వరకూ పదవిలో కొనసాగారు.
2007లో ఆటోమోటివ్ సేల్స్, సర్వీస్ కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియాను ఆయన స్ధాపించారు. కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదుపై రూ 110 కోట్ల బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి 2019 డిసెంబర్ లో ఖట్టర్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆయన రుణాన్ని తిరిగి చెల్లించలేదని పీఎన్ బీ ఆరోపించింది. కాగా ఈ ఆరోపణలను అప్పట్లో ఖట్టర్ తోసిపుచ్చారు.