నిల్వలు ఎక్కువగా ఉన్నాయనే
దేశంలో ఎఫ్సీఐ వద్ద బియ్యం నిల్వలు అవసరానికి మించి ఉండటంతోపాటు గోదాములన్నీ నిండిపోయాయి. దీంతో ఈ యాసంగిలో వచ్చే బియ్యాన్నిఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో కొనుగోళ్లను తగ్గించడానికి కొన్ని షరతులు విధిస్తున్నట్టు తెలిసింది. దేశంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. విదేశాలకు ఎగుమతి చేస్తే నిల్వలు ఖాళీ అవడంతోపాటు రైతులకు మద్దతు ధర కూడా లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): సాధారణంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఏటా వానకాలంలో మిల్లర్ల నుంచి రా రైస్ (పచ్చిబియ్యం), యాసంగిలో బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) సేకరిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా యాసంగిలోనూ రా రైస్ కావాలని ఆదేశాలు జారీచేసింది. యాసంగిలో రా రైస్ సేకరణ సాధ్యం కాదు. తెలంగాణలో యాసంగిలో ఎక్కువగా దొడ్డు బియ్యం పండిస్తారు. ఇది బాయిల్డ్ రైస్గానే పనికొస్తుంది తప్ప రా రైస్గా పనికిరాదు. ఈ విషయం ఎఫ్సీఐకీ తెలుసు. కానీ, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు సృష్టించేందుకే ఈ రకమైన నిబంధనలు పెట్టిందనే అనుమానాలను అధికారులు, మిల్లర్లు వ్యక్తంచేస్తున్నారు. ఈ యాసంగిలో తెలంగాణలో సుమారు 75 లక్షల టన్నులకు పైగా ధాన్యం వస్తుందని అంచనా.
రా రైస్తో నూక ఎక్కువ యాసంగి ధాన్యంతో బాయిల్డ్ రైస్ తీస్తే నూక శాతం తక్కువగా వస్తుంది. ఈ ధాన్యాన్ని ఉడికించి మళ్లీ ఆరబెట్టి బియ్యం చేస్తారు కాబట్టి నూక శాతం 16 నుంచి 20 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం నూక 16 శాతం మినహాయింపు ఉంటుంది. అదే రా రైస్ తీస్తే ఏకంగా 50 నుంచి 60 శాతం నూక వచ్చే అవకాశం ఉన్నదని రైస్ మిల్లర్లు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే తాము నిబంధనల ప్రకారం ఎఫ్సీఐకి సీఎమ్మార్ (కస్టం మిల్డ్ రైస్) సరఫరా చేయలేమని స్పష్టంచేస్తున్నారు. సాధారణంగా మిల్లర్లకు క్వింటాలు ధాన్యం ఇస్తే వారు ఎఫ్సీఐకి 68 కిలోల బియ్యం అందించాలి. కానీ రా రైస్ చేస్తే 50- 60 శాతం నూక రూపంలో పోతే.. 68 కిలోల బియ్యం ఎక్కడినుంచి ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. గత యాసంగిలో తెలంగాణ నుంచి ఎఫ్సీఐ 64.17 లక్షల టన్నుల సీఎమ్మార్ను బాయిల్డ్ రైస్ రూపంలోనే తీసుకున్నది. కానీ ఈసారి కొర్రీలు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా తెలంగాణ బాయిల్డ్ రైస్కు దేశ, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్నది. అయినప్పటికీ ఎఫ్సీఐ మాత్రం మన బియ్యం తీసుకొనేందుకు సమస్యలు సృష్టిస్తున్నది.
కొనుగోళ్లపై లేఖకు సమాధానం కరువు
ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు అనుమతుల కోసం తెలంగాణ పౌరసరఫరాలశాఖ 15 రోజుల క్రితం ఎఫ్సీఐకి లేఖ రాసింది. ఇప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో సివిల్ సైప్లె అధికారుల్లో ఆందోళన నెలకొన్నది. లేఖకు సమాధానం ఇవ్వకపోవడం, బాయిల్డ్ రైస్కు బదులుగా రా రైస్ అడగడం ఇవన్నీ చూస్తుంటే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసేందుకే ఇదంతా చేస్తుందని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
రా రైస్ మేం ఇవ్వలేం
గతానికి భిన్నంగా ఈ యాసంగిలో రా రైస్ ఇవ్వాలంటూ ఎఫ్సీఐ నిబంధన పెట్టింది. ఇది సాధ్యం కాదు. 10నుంచి 15 శాతం రా రైస్ అంటే ప్రయత్నించగలం. కానీ మొత్తం రా రైస్ కావాలంటే మా వల్ల కాదు. ధాన్యం కొనుగోళ్లలో, సీఎమ్మార్ సేకరణలో ఎఫ్సీఐ నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో రైస్ మిల్లులు మూసుకోవడం ఖాయం.