ముంబై : మహారాష్ర్ట థానే జిల్లాలోని భివండిలో శనివారం రాత్రి విషపూరితమైన గ్యాస్ లీక్ అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అక్కడ బహిరంగ ప్రదేశంలో ఉంచిన సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైనట్లు అధికారులు ఆదివారం నిర్ధారించారు. ఈ గ్యాస్ లీకేజీ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశంలో ఉంచిన 16 సిలిండర్లలో సల్ఫర్ డైఆక్సైడ్ నిల్వ ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో రెండు సిలిండర్ల నుంచి ఆ వాయువు లీకేజీ అయిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి గ్యాస్ లీకేజీని అదుపు చేశారు.