న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్ లేదా ముకోర్మైకోసిస్ వ్యాధి కేసులు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ రోగుల్లో ఈ కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 1897 నాటి ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్లో బ్లాక్ ఫంగస్ వ్యాధిని చేర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. బ్లాక్ ఫంగస్ వల్ల మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాలు, మెడికల్ కాలేజీలు.. ప్రభుత్వ మార్గదర్శకాలను ఫాలోఅవ్వాలని, బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్, డయాగ్నసిస్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాక కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. బ్లాక్ ఫంగస్ వల్ల ముక్కు రంగు మారుతుంది.. చూపు మందగిస్తుంది.. ఛాతి నొప్పి వస్తుంది.. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. డయాబెటిస్ ఉన్న రోగుల్లో ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి.
కర్నాటక, ఉత్తరాఖండ్, తెలంగాణ, మధ్యప్రదేవ్, ఏపీ, హర్యానా, బీహార్ లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ముకోర్ మైకోసిస్ లక్షణాలు కనిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఈ వ్యాధిని ఎపిడమిక్గా ప్రకటించింది. తమ రాష్ట్రంలో నాలుగు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయినట్లు బెంగాల్ సీఎం మమతా ఇవాళ తెలిపారు. ఢిల్లీలోనూ ప్రత్యేక హాస్పిటళ్లలో ఈ వ్యాధికి చికిత్స చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్లోని కోఠి హాస్పిటల్ను చికిత్సా కేంద్రంగా ప్రకటించారు.