న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆక్సికేర్ వ్యవస్థల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.322.5 కోట్ల పీఎం కేర్స్ నిధులతో 1.5 లక్షల యూనిట్లను సమకూర్చోవాలని నిర్ణయించింది. మ్యానువల్గా నియంత్రించే లక్ష యూనిట్లు, ఆటోమేటిక్గా పని చేసే 50 వేల యూనిట్లతోపాటు నాన్ రీబ్రితర్ మాస్క్లను కేంద్రం కొనుగోలు చేయనున్నది.
రోగిలోని ఆక్సిజన్ స్థాయిల ఆధారంగా ఆక్సికేర్ వ్యవస్థ పని చేస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి ఆక్సిజన్ను ఎక్కువగా, తగినంత స్థాయిలు ఉన్నవారికి తక్కువగా సరఫరా చేస్తుంది. దీంతో రోగికి కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా చేసి వారిని ప్రాణాపాయ ముప్పు నుంచి కాపాడటంతోపాటు ఆక్సిజన్ వృధాను అరికడుతుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆక్సికేర్ టెక్నాలజీని దేశంలోని కొన్ని పరిశ్రమలకు డీఆర్డీవో బదిలీ చేసింది. అలాగే నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఏడు ఆక్సిజన్ ప్లాంట్లను ఒడిశాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.