న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికుల కరోనా టెస్ట్ రిపోర్ట్స్ను సరిగా పరిశీలించని నాలుగు విమానయాన సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధానిలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. కరోనా కేసుల తీవ్రత పెరుగున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించింది. మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి ప్రయాణించేవారు తప్పని సరిగా 72 గంటల ముందు పరీక్షించిన ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ను సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ నెల 30 వరకు ఇది అమలులో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే కొన్ని విమానయాన సంస్థలు ఈ ఆదేశాన్ని సరిగా పాటించడం లేదన్న సంగతి ప్రభుత్వం ద`ష్టికి వచ్చింది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్టును పరిశీలించకుండానే విమానాల్లో ప్రయాణానికి అనుమతించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఆసియా, స్పైస్జెట్, విస్తారా సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నాలుగు విమానయాన సంస్థలపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.