శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాకు కరోనా సోకింది. తనకు పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. ‘ఒక సంవత్సరం పాటు ఈ హేయమైన వైరస్ను ఓడించటానికి నేను నా వంతు ప్రయత్నం చేశాను. కాని, చివరకు అది నాకు సోకింది. కరోనా పాజిటివ్గా ఈ మధ్యాహ్నం నిర్ధారణ అయ్యింది. నాలో ఎలాంటి లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు హోమ్ ఇసొలేషన్లో ఉన్నాను. ఆక్సిజన్ స్థాయిలు వంటివి పర్యవేక్షిస్తున్నాను’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాగా, ఆయన రెండు రోజుల కిందట కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.
మరోవైపు ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా మార్చి 30న కరోనా బారిన పడ్డారు. స్కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఈ నెల 6న డిశ్చార్జ్ అయ్యారు.