న్యూఢిల్లీ/కోల్కతా, జూన్ 1: ‘యాస్’ తుఫాన్ సమీక్షా సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం, మమత సర్కారు మధ్య మొదలైన వివాదం కీలక మలుపులు తిరుగుతున్నది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారిన పశ్చిమబెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్కు కేంద్రం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 (సెక్షన్ 51(బీ)) కింద సమన్లు జారీ చేసినట్టు వెల్లడించింది. ఢిల్లీకి డిప్యుటేషన్పై రావాల్సిందిగా జారీ చేసిన ఆదేశాలకు స్పందించకపోవడంతో బంధోపాధ్యాయ్కు ఈ నోటీసులు జారీ చేసినట్టు వివరించింది. దీనిపై మూడు రోజుల్లోగా సమాధానం తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు, బంధోపాధ్యాయ్కి షోకాజ్ నోటీసులు జారీచేయడం చట్టవిరుద్ధమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. ఏ నిబంధన ప్రకారం విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద నోటీసులు జారీచేశారని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వంపై కేంద్రానిది ప్రతీకారచర్యేనని మండిపడ్డారు.
అసలేమైంది?
బెంగాల్లో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన ‘యాస్’ సమీక్షా సమావేశానికి మమత, బంధోపాధ్యాయ్ ఆలస్యంగా రావడంతో వివాదం తలెత్తింది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం.. ఢిల్లీకి డిప్యూటేషన్పై రావాలని ఆయనను ఆదేశించింది. కానీ ఆయన రిపోర్ట్ చేయలేదు. దీంతో షోకాజ్ నోటీసులను పంపింది.
ధిక్కరిస్తే రెండేండ్ల జైలు!
కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వ అధికారులు.. విపత్తు నిర్వహణ చట్టం, 2005 సెక్షన్ 51(బీ) కింద నోటీసులు జారీచేస్తే తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రెండేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉన్నది.