ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 14వ సీజన్ మలిదశ మ్యాచ్లను ఇంగ్లండ్ వేదికగా జరుపాలని ఆలోచిస్తున్నది. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడకపోతే జూన్ తర్వాత మెగాటోర్నీ తరలింపుపై ఆలోచన మొదలుపెట్టాలని అనుకుంటున్నది. ఈ అంశాలు సహా దేశవాళీ సీజన్ నిర్వహణపైనా ఈనెల 29న జరుగనున్న ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్)లో బీసీసీఐ ముమ్మరంగా చర్చించనుంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ మ్యాచ్లు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తీవ్ర కసరత్తులు చేస్తున్నది. బయోబబుల్లో కరోనా కేసులు నమోదవడంతో అర్ధాంతరంగా వాయిదా వేసిన సీజన్ను స్వదేశంలో నిర్వహించే పరిస్థితులు లేవు. దీంతో ప్రత్యామ్నాయాలపై బోర్డు ఆలోచిస్తున్నది. ఈ క్రమంలో ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్లకు ఇంగ్లండ్ అయితే మేలని బీసీసీఐ భావిస్తున్నది. ఈ విషయంపై ఈనెల 29న జరిగే ఎస్జీఎమ్లో చర్చించనుంది. ఇంగ్లిష్ కౌంటీ క్లబ్లు సైతం ఐపీఎల్ ఆతిథ్యానికి ముందుకు రాగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా సుముఖంగా ఉంది. అయితే అక్కడ టోర్నీ నిర్వహిస్తే ఖర్చుల భారం ఎక్కువవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తున్నది. ‘బ్రిటన్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే క్రీడా టోర్నీలకు బ్రిటన్ ప్రభుత్వం ప్రేక్షకులను అనుమతిస్తున్నది. దీంతో టికెట్ల ద్వారా ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నది’ అని బోర్డు చెందిన ఓ అధికారి చెప్పారు. అలాగే ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్లో నిర్వహించడం ఆర్థికంగా భారం అని అనుకుంటే యూఏఈ, శ్రీలంకనూ బీసీసీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సహా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడేందుకు భారత్ జూన్ మొదటి వారంలో ఇంగ్లండ్కు బయలుదేరనుంది.
సెప్టెంబర్లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో ఈ ఏడాది దేశవాళీ సీజన్ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ తర్వాత విజయ్ హజారే, రంజీ ట్రోఫీలు నిర్వహించాలనుకుంది. అయితే దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ ఉద్ధృతంగా ఉండడం, ఐపీఎల్ కూడా వాయిదా పడడంతో దేశవాళీ సీజన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై బోర్డు పునరాలోచించనుంది. బయోబబుల్ సహా మిగిలిన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందా అని ఎస్జీఎమ్లో సమాలోచనలు చేయనుంది.
అర్ధాంతరంగా వాయిదాపడ్డ ఐపీఎల్-14వ సీజన్లో కరోనా వైరస్ బారిన పడిన భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, సీనియర్ స్పిన్నర్ అమిత్మిశ్రా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్ టూర్కు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైన విషయం తెలిసిందే.