లోక్సభలో రిజిజు వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 5: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రప్రభుత్వం పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే ఎన్నికల వ్యయం ఎక్కువవుతుందని, జమిలి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ఈ సిఫారసులను లా కమిషన్కు పంపించినట్టు చెప్పారు. ఎన్నికల సంస్కరణలపైన లా కమిషన్ కూడా అనుకూలంగా సిఫారసులు చేసిందని, ప్రస్తుతం అవి కేంద్రం పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014-19 మధ్యకాలంలో రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం రూ.5,814కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.