న్యూఢిల్లీ, మే 27: టీకాల కొనుగోలుపై అలసత్వం వహించారన్న విపక్షాల విమర్శలను కేంద్రప్రభుత్వం తిప్పికొట్టింది. వ్యాక్సిన్ కొనుగోలు విధానాన్ని సమర్థించుకున్నది. వీలైనంత త్వరగా టీకాలను దిగుమతి చేసుకునేలా 2020 మధ్య నుంచే ఫైజర్, జేజే, మోడెర్నా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. ‘భారత వ్యాక్సినేషన్ విధానంపై అపోహలు, వాస్తవాలు’ పేరిట కేంద్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎప్పుడు, ఎన్ని టీకాలకు కేంద్రం ఆర్డర్లు ఇచ్చిందో ప్రకటనలో వెల్లడించలేదు.
నిబంధనలు సరళీకృతం
అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ, ఈఏంఎ, బ్రిటన్కు చెందిన ఎంహెచ్ఆర్ఏ, జపాన్కు చెందిన పీఎండీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపిన టీకాలకు భారత్లో అనుమతులకు నిబంధనలు సరళీకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. ‘ఈ టీకాలపై బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీనిని మరింత సరళీకృతం చేస్తూ.. విదేశాల్లో తయారైన ప్రముఖ టీకాలకు పూర్తిగా ట్రయల్స్ ఎత్తివేశాం’ అని వివరించింది.
విదేశీ టీకా కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు..
అంతర్జాతీయంగా వ్యాక్సిన్లు పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉన్నాయని, టీకాల కేటాయింపులో కంపెనీలకు కూడా వాటి సొంత ప్రాధాన్యాలు ఉన్నాయని కేంద్రం పేర్కొన్నది. మనదేశంలోని వ్యాక్సిన్ కంపెనీలు మనకు ప్రాధాన్యమిచ్చినట్టే విదేశీ కంపెనీలూ తమ సొంత దేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపింది. ‘ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా కంపెనీలతో పలు దఫాలుగా చర్చించాం. భారత్లో టీకాల ఉత్పత్తికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం’ అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ కృషి ఫలితంగానే స్పుత్నిక్-వీ టీకాకు వేగంగా అనుమతులు లభించాయని వెల్లడించింది.
దేశీయంగా ఉత్పత్తిని పెంచుతున్నాం..
దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంపై తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలను ప్రభుత్వం కొట్టివేసింది. ‘పేటెంట్ కలిగిన ఏకైక భారత కంపెనీ భారత్ బయోటెక్ ఒక్కటే. కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ ప్లాంట్లను పెంచడంతోపాటు మరో మూడు కంపెనీలూ ఆ టీకాను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ బయోటెక్తో పాటు అదనంగా మూడు ప్రభుత్వ రంగ సంస్థలు డిసెంబర్ నాటికల్లా నాలుగుకోట్ల డోసులను ఉత్పత్తి చేయనున్నాయని తెలిపింది.
రాజకీయాలకు సమయం కాదు..
రాష్ట్రాలపై భారం మోపి కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకున్నదన్న విమర్శలను ప్రభుత్వం కొట్టివేసింది. వైద్యం అంశం రాష్ర్టాల జాబితాలోనిదని, రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తులు చేసిన ఫలితంగానే వ్యాక్సిన్ పాలసీని సరళీకరించినట్టు పేర్కొన్నది. పారదర్శక రీతిలో రాష్ర్టాలకు తగినన్ని వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని తెలిపింది. వ్యాక్సిన్ల లభ్యతపై అవగాహన ఉన్నప్పటికీ పలువురు మీడియా ముందుకొచ్చి ప్రజల్లో భయాలను రేకెత్తించడం దురదృష్టకరమని పేర్కొన్నది. రాజకీయాలకు ఇది సమయం కాదని, అందరం కలసికట్టుగా కరోనాపై పోరాడాలని సూచించింది.