హైదరాబాద్: కేంద్ర బలగాలు నగరంలోని భారత్ బయోటెక్ క్యాంపస్కు సెక్యూర్టీ ఇవ్వనున్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్సెస్ కమాండోలు.. హైదరాబాద్ క్యాంపస్ను పరిరక్షిస్తాయని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొన్నది. భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 14వ తేదీన నుంచి హైదరాబాద్ కంపెనీలో 64 మంది సీఐఎస్ఎఫ్ కమాండోలు పహారాకాయనున్నారు. శామిర్పేట్లోని జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ క్యాంపస్ ఉన్నది. ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ సర్వే చేపట్టారు. వైద్య, ఆరోగ్య రంగంలో భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రదేశమని, దానికి ఉగ్ర ముప్పు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ దళాలను అక్కడ మోహరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
జూన్ 14వ తేదీ నుంచి దళాలు విధులు నిర్వర్తిస్తాయని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, ప్రధాన ప్రతినిధి అనిల్ పాండే తెలిపారు. ప్రజా ప్రయోజన సంబంధం ఉన్న కంపెనీలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తుంది. పుణె, మైసూర్లోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్లోని పతంజలి ఫ్యాక్టరీలకు కూడా సీఐఎస్ఎఫ్ దళాలు భద్రతను కల్పిస్తున్నాయి. భద్రతకు అయ్యే ఖర్చును భారత్ బయోటెక్ సంస్థ భరించనున్నది.