న్యూఢిల్లీ, జూలై 1: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని మోదీ ఒకటి రెండు రోజుల్లో విస్తరణ చేపట్టవచ్చని తెలుస్తున్నది. వచ్చే ఏడాది జరుగునున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. గతేడాది కాంగ్రెస్కు గుడ్బై కొట్టి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. అస్సాం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్కు కూడా క్యాబినెట్లో బెర్త్ ఖాయమైందని అంటున్నారు. అస్సాంలో సీఎం పదవిని హిమంత బిశ్వ శర్మకు కట్టబెట్టేందుకు పార్టీ పెద్దల మాట విని శర్బానంద పోటీ నుంచి తప్పుకున్నారు. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీలిక వర్గం నేత పశుపతి పరాస్కు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కనున్నదని సమాచారం. దివంగత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్పై పరాస్ ఇటీవల తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
రాంవిలాస్ పాశ్వాన్ మృతితో కేంద్ర మంత్రివర్గంలో ఖాళీ అయిన స్థానాన్ని పరాస్తో భర్తీ చేస్తారని అంటున్నారు. ఇక జేడీయూకి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీకి చెందిన లల్లన్ సింగ్, రాంనాథ్ ఠాకూర్, సంతోష్ కుశ్వాహ పోటీలో ఉన్నారు. సుశీల్ మోదీ (బీహార్), నారాయణ్ రాణె (మహారాష్ట్ర), బీహార్, గుజరాత్ రాష్ర్టాల ఇన్చార్జి, సీనియర్ నేత భూపేంద్ర యాదవ్కు కూడా పదవులు లభిస్తాయని చెబుతున్నారు. వరుణ్ గాంధీ, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జఫర్ ఇస్లామ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు క్యాబినెట్ విస్తరణలో ప్రాధాన్యం లభిస్తుందని సమాచారం. బెంగాల్ నాయకులకు ప్రాతినిథ్యం లభించనున్నది. ఆ రాష్ర్టానికి చెందిన ముగ్గురు ఎంపీల పేర్లు పోటీలో వినిపిస్తున్నాయి. కేంద్ర క్యాబినెట్లో 81 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 53 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 28 మందిని కొత్తగా చేర్చుకునే అవకాశం ఉంది.