పిల్లల ఎదుగుదల కోసం దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రమించిన ఆ తల్లి.. తన కూతుళ్లిద్దరూ ఒక స్థాయికి వచ్చి, తమతమ ఉద్యోగాలకు వెళ్లడంతో.. ఒక్కసారిగా ఒంటరి అయిపోయారు. ఆ ఏకాంతాన్ని ఓ వరంగా మలుచుకొని, తనను తాను చిత్రకారిణిగా తీర్చిదిద్దుకొన్నారు హైదరాబాద్ మణికొండ నివాసి వాసిరెడ్డి స్పందన.
ప్రతి తల్లి జీవితంలోనూ తారస పడే దశే అది. బిడ్డ పుట్టినప్పటి నుంచీ అమ్మ ఆరాటమంతా పిల్లల గురించే. సమయానికి భోజనం పెట్టాలి, సకాలంలో బాక్సు సర్దాలి, సాయంత్రానికి ఏమైనా ఫలహారం చేయాలి, కొంతసేపు చదివించాలి, కథలు చెప్పి నిద్ర పుచ్చాలి, దగ్గో జలుబో వస్తే సంరక్షణ అందించాలి. పిల్లలు ఎదుగుతున్నకొద్దీ అమ్మ బాధ్యత పెరుగుతుంది. ప్రయోజకులై మంచి ఉద్యోగాలు వెతుక్కోగానే.. బిడ్డలు ఎగిరిపోతారు. తల్లి ఒంటరి పక్షిగా మిగిలిపోతుంది. దీన్నే ‘ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ ‘ఒంటరి భావన’ కొందరిని డిప్రెషన్కు గురిచేస్తుంది. కానీ, వాసిరెడ్డి స్పందన ఈ మలుపును సద్వినియోగం చేసుకున్నారు. పాజిటివ్గా తీర్చిదిద్దుకున్నారు. తనకు ఏ మాత్రం పరిచయం లేని చిత్రకళను నేర్చుకున్నారు. స్వయంగా అభ్యాసం చేస్తూ తనలోని నైపుణ్యాన్ని వెలికి తీయడం ప్రారంభించారు. మూడేండ్లలోనే 150కి పైగా చిత్రాలకు ప్రాణం పోశారు.
భారతీయ సంస్కృతి ఇతివృత్తంగా..
లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ చేసిన స్పందన అంతకు ముందు సాధారణ గృహిణి. ఇప్పుడు చిత్రకారిణిగా కళాభిమానుల నుంచి మన్ననలు పొందుతున్నారు. మహిళల జీవన విధానం, ప్రకృతి అందాలు, భారతీయ సంస్కృతి, ఇతిహాసాలకు చెందిన ఇతివృత్తాలను ఎంచుకుంటారామె. గత నవంబరులో ‘కొవిడ్ ఆర్ట్’ పేరుతో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. సాలార్జంగ్ మ్యూజియం, బియాండ్ కాఫీ తదితర వేదికలమీద చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. ‘ప్రతి తల్లిలో అపారమైన శక్తి దాగి ఉంటుంది. పిల్లలు తమ జీవితంలో స్థిరపడ్డాక ఆ ఎనర్జీని తన అస్తిత్వం కోసం వినియోగించుకోవాలి’ అని సలహా ఇస్తారు స్పందన.
… వరకవుల దుర్వాసరాజు