ద్వితీయ స్థానం కోసం కోదండరాం, మల్లన్న మధ్య హోరాహోరీ
ఒక్కో రౌండ్కు మూడు గంటలకు పైగా సమయం
రాత్రంతా కౌంటింగ్
నేడే గెలుపు కోటాపై స్పష్టత
వరంగల్/నల్లగొండ, మార్చి17 (నమస్తే తెలంగాణ ప్రతినిధులు) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల పోరులో తీర్పు పల్లా వైపే ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తం ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యతా ఓట్లు లెక్కించనుండగా తొలి రౌండ్ ఫలితాలు బుధవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికే అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెండో స్థానానికి కోదండరాం, చింతపండు నవీన్కుమార్ (మల్లన్న) పోటీపడుతుండగా, బీజేపీ, కాంగ్రెస్ నాలుగు, ఐదు స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఒక్కో రౌండ్ లెక్కింపు మూడు గంటలకుపైగా పడుతున్నది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన తొలిరౌండ్ కౌంటింగ్, రాత్రి 10వరకు కొనసాగింది. దీని ప్రకారం గురువారం ఉదయం 10గంటల దాకా తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశముండగా, ఫలితం కూడా నేడే తేలనుంది.
నల్లగొండ పట్టణ పరిధిలోని స్టేట్వేర్ హౌసింగ్ గోదాముల్లో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఉదయం 8గంటలకు లెక్కింపు మొదలైంది. ఎనిమిది హాళ్లు, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లపై మొత్తం 56 టేబుళ్లలో లెక్కింపు కొనసాగుతున్నది. ప్రతి టేబుల్కు 13 బ్యాలెట్ బాక్స్లు కేటాయించారు. వీటిని ఒపెన్ చేసి ముందుగా 25బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. ఇలా మొత్తం పోలైన 3,86,320 బ్యాలెట్ పేపర్లను కట్టలుగా చేశారు. ఇదే సమయంలో 1917 పోస్టల్ బ్యాలెట్లను కూడా 25 చొపున కట్టలుగా చేశారు. వీటిని ముందే పరిశీలించగా 79 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. చెల్లిన పోస్టల్ బ్యాలెట్లు 1838తో పాటు సాధారణంగా పోలైన 3,86,320 ఓట్లు కలిపి మొత్తం 3,88,011 ఓట్లను లెక్కిస్తున్నారు.
తొలిరౌండ్లో కారు హవా
సాయంత్రం ఆరు గంటలకు తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో టేబుల్కు వెయ్యి బ్యాలెట్ల చొప్పున కేటాయించి మొత్తం 56 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. ఒక్కో రౌండ్లో 56వేల ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఇదే సమయంలో రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చే ఓట్లను ఓ వైపు, చెల్లని ఓట్లను మరో బాక్స్లో వేస్తున్నారు. ఈ క్రమంలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో అన్ని టేబుళ్లపైనా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించారు. ఏడు రౌండ్లల్లో తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. రెండో రౌండ్ రాత్రి 11గంటలకు మొదలైంది. ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావాలంటే నేడు ఉదయం పది గంటలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయ్యాక చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లతో గెలుపు కోటా నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవ్వరికీ గెలుపు కోటా రాకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యతా ఓట్ల తొలి రౌండ్ లెక్కింపు సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, కోదండరామ్, మల్లన్న, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాములునాయక్, ఇతర అభ్యర్థులు ఆసక్తిగా ట్రెండ్ను గమనిస్తూ కౌంటింగ్ హాల్స్లో కనిపించారు. సిట్టింగ్ స్థానంలో మరోసారి జయకేతనం ఎగురవేస్తామని పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.